By - jyotsna |20 May 2026 9:00 AM IST
భారత శాస్త్రీయ సంగీతంతో అలరించిన ఇటలీ కళాకారులు
ప్రధాని నరేంద్ర మోదీ తన ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్లో అరుదైన అనుభూతిని పొందారు.
అక్కడ తనకు స్వాగతం పలికేందుకు ఐదుగురు ఇటలీ కళాకారులు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. వారి ప్రదర్శనపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.
"ఇటలీలో భారతీయ సంగీతానికి ఆదరణ బాగా పెరుగుతోంది. రోమ్లో జరిగిన స్వాగత కార్యక్రమంలో ఐదుగురు ఇటలీ కళాకారులు 'హంసధ్వని' రాగాన్ని అద్భుతంగా వినిపించారు" అని మోదీ పేర్కొన్నారు. వాలెరియో బ్రూనీ (సంతూర్), లియో వెర్టూనీ (సితార్), సిమోన్ మట్టిఎల్లో (బాన్సురీ), ఫ్రాన్సెస్కో ఘెరార్డీ (తబలా), నికోలో మెల్లోచి (బాన్సురీ)లకు ఆయన అభినందనలు తెలిపారు.
కర్ణాటక, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో 'హంసధ్వని' రాగానికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని 18వ శతాబ్దంలో రామస్వామి దీక్షితార్ స్వరపరిచారు. సంగీత కచేరీల ప్రారంభంలో ఈ రాగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.
ప్రధాని మోదీని కలవడంపై ఇటలీ కళాకారులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ప్రదర్శన సమయంలో మోదీ చప్పట్లు కొడుతూ తమను ఉత్సాహపరిచారని, ఆయన తమతో కనెక్ట్ అయ్యారని కళాకారులు తెలిపారు. తాము ఆయనతో కరచాలనం చేసి, ఫోటోలు కూడా దిగామని తబలా కళాకారుడు ఫ్రాన్సెస్కో ఘెరార్డీ అన్నారు. ప్రధాని ముందు ప్రదర్శన ఇవ్వడం గొప్ప అవకాశమని మరికొందరు అభిప్రాయపడ్డారు.
ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ చివరిగా మంగళవారం రోమ్ చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆయనకు సాదర స్వాగతం పలికారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన ఇటలీ పర్యటనలో భాగంగా రోమ్లో అరుదైన అనుభూతిని పొందారు. అక్కడ తనకు స్వాగతం పలికేందుకు ఐదుగురు ఇటలీ కళాకారులు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. వారి ప్రదర్శనపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.

