By - Sathwik |24 May 2026 5:15 PM IST
100 మీటర్ల పరుగు.. నేషనల్ రికార్డ్.. అద్లెటిక్స్ చరిత్రలో కొత్త అధ్యాయం.. 10.09 సెకనల్లోనే 100 మీటర్లు పూర్తి
భారత అథ్లెటిక్స్ రంగంలో కొత్త శకం ప్రారంభమవుతోందనే సంకేతాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో స్ప్రింట్ ఈవెంట్లలో ప్రపంచ స్థాయిలో పోటీ ఇవ్వడంలో భారత్ వెనుకబడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యేవి. అయితే ఇప్పుడు యువ అథ్లెట్లు తమ అసాధారణ ప్రదర్శనలతో ఆ అభిప్రాయాలను పూర్తిగా మార్చేస్తున్నారు. రాంచీలో జరిగిన ఫెడరేషన్ కప్ పోటీలు భారత ట్రాక్ అండ్ ఫీల్డ్ చరిత్రలో గుర్తుండిపోయే ఘట్టాలకు వేదికగా నిలిచాయి. ముఖ్యంగా పురుషుల 100 మీటర్ల రేసులో పంజాబ్కు చెందిన స్ప్రింటర్ గురిందర్వీర్ సింగ్ చూపిన ప్రతిభ దేశ క్రీడా చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయాన్ని లిఖించింది. రాంచీలోని బిర్సా ముండా స్టేడియంలో జరిగిన ఈ పోటీల్లో 25 ఏళ్ల గురిందర్వీర్ సింగ్ తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. పురుషుల 100 మీటర్ల రేసులో కేవలం 10.09 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని కొత్త జాతీయ రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. ఇది కేవలం ఒక కొత్త రికార్డు మాత్రమే కాదు, భారత అథ్లెటిక్స్ చరిత్రలో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. భారతీయ అథ్లెట్ తొలిసారిగా 100 మీటర్ల రేసును 10.09 సెకన్ల లోపు పూర్తి చేయడం విశేషంగా మారింది. దీంతో గురిందర్వీర్ ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగవంతమైన అథ్లెట్గా గుర్తింపు పొందాడు.
ఈ ప్రదర్శనతో భారత్ అంతర్జాతీయ స్ప్రింట్ పోటీల్లో కూడా తన ముద్ర వేయగలదనే ఆశలు పెరిగాయి. ప్రపంచ స్థాయి పోటీల్లో కనిపించే టైమింగ్స్కు దగ్గరగా ఉండే విధంగా గురిందర్వీర్ ప్రదర్శన ఉండటం విశ్లేషకులను ఆకట్టుకుంది. అతని వేగం భవిష్యత్తులో ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో దేశానికి మరిన్ని అవకాశాలు తీసుకురావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫినిషింగ్ లైన్ దాటిన వెంటనే గురిందర్వీర్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. విజయం సాధించిన క్షణంలో తన భావోద్వేగాలను దాచుకోలేకపోయాడు. ఛాతీపై ఉన్న బిబ్ నంబర్ను తీసివేసి, తన బూట్లను ట్రాక్పైకి విసురుతూ విజయోత్సాహాన్ని వ్యక్తం చేశాడు. అతని స్పందన చూస్తే ఈ విజయం కోసం ఎంతకాలం శ్రమించాడో స్పష్టమైంది. తన విజయంపై స్పందిస్తూ గురిందర్వీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారతీయులకు 100 మీటర్ల పరుగులో రాణించే జన్యుపరమైన సామర్థ్యం తక్కువగా ఉంటుందని చాలామంది చెబుతుంటారని, అలాంటి అభిప్రాయాలు తప్పని నిరూపించాలని తాను ఎప్పటి నుంచో అనుకున్నానని పేర్కొన్నాడు. భారతీయుల సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం సరికాదని, ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని ధీమా వ్యక్తం చేశాడు.
ఈ సీజన్లో ఆసియా స్థాయిలో నమోదైన అత్యంత వేగవంతమైన సమయాల్లో గురిందర్వీర్ 10.09 సెకన్లు రెండో స్థానంలో నిలిచాయి. జపాన్కు చెందిన స్ప్రింటర్ ఫుకుటో కొమురో నమోదు చేసిన 10.08 సెకన్ల సమయానికి కేవలం 0.01 సెకన్ల తేడాతో వెనుకబడ్డాడు. ఇదే సమయంలో 2026 కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించేందుకు అవసరమైన 10.16 సెకన్ల మార్క్ను కూడా అతను సులభంగా అధిగమించాడు. అయితే ఈ టోర్నీలో మరో ఆసక్తికర అంశం జాతీయ రికార్డులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు మారడం. ఒడిశాకు చెందిన స్ప్రింటర్ అనిమేష్ కుజుర్ ఈ ఈవెంట్లో ఫేవరెట్గా బరిలోకి దిగాడు. గతంలో 10.18 సెకన్ల జాతీయ రికార్డు అతని పేరిట ఉండేది. మొదటి సెమీఫైనల్లో గురిందర్వీర్ 10.17 సెకన్లతో ఆ రికార్డును అధిగమించాడు. దీంతో ఒకేరోజులో జాతీయ రికార్డు రెండు సార్లు మారడం పోటీలను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. అయితే అసలు పోరాటం ఫైనల్లో కనిపించింది. ఫైనల్ రేసులో గురిందర్వీర్ మరోసారి తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. అనిమేష్ కంటే 0.11 సెకన్లు వేగంగా పరిగెత్తి దాదాపు రెండు అడుగుల తేడాతో ఫినిషింగ్ లైన్ దాటాడు. రిలయన్స్ ఫౌండేషన్కు చెందిన ప్రణవ్ గురవ్ 10.29 సెకన్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
తన విజయ రహస్యాన్ని వెల్లడిస్తూ గురిందర్వీర్ మాట్లాడుతూ, తమ శిక్షణలో బలహీనతలను గుర్తించి వాటిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టామని పేర్కొన్నాడు. కేవలం శారీరకంగా బలంగా ఉండటం మాత్రమే సరిపోదని, మానసికంగా కూడా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉందని వివరించాడు. చివరి క్షణాల్లో మానసిక స్థైర్యమే విజయాన్ని నిర్ణయిస్తుందని అభిప్రాయపడ్డాడు.

