By - Sathwik |15 May 2026 5:00 PM IST
కల్లు తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగం... కల్లుకు పూర్వ వైభవం తెస్తామన్న మంత్రి.. కల్లు ప్రకృతి ఔషధమన్న పొన్నం ప్రభాకర్
తెలంగాణ పల్లె జీవన విధానంలో తాటి చెట్టు కేవలం ఒక వృక్షం మాత్రమే కాదు.. అది సంస్కృతికి ప్రతీక, వేలాది గీత కార్మికుల జీవనాధారం. కాలక్రమేణా మసకబారిన తాటి వృత్తికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. సంప్రదాయాన్ని ఆధునికతతో కలిపి తాటి కల్లు, నీరాను ప్రజలకు చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సహజసిద్ధమైన ఈ పానీయాలను ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నలతో కలిసి మంత్రి మాట్లాడారు. తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న తాటి కల్లు, నీరాను కేవలం సాధారణ పానీయాలుగా కాకుండా ప్రకృతి ప్రసాదించిన ఔషధాలుగా ప్రజల్లో గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో ఈ పానీయాలపై నెలకొన్న అపోహలను తొలగించి, వాటి ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ నర్సరీల్లో తాటి, ఈత మొక్కల పెంపకాన్ని విస్తృతంగా ప్రోత్సహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున తాటివనాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, గీత వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మరింత పెరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక తాటి కల్లు, నీరాను నగర జీవనశైలికి కూడా చేరువ చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్లోని ప్రధాన హోటళ్లు, ఫైవ్ స్టార్ హోటళ్లలో స్వచ్ఛమైన కల్లు, నీరా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. సంప్రదాయ పానీయాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలంటే నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మార్కెటింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గీత కార్మికుల సేవలను గౌరవిస్తూ, తాటి ఉత్పత్తుల ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ఈ నెల 24న చిలుకూరు సమీపంలోని ఎక్స్పీరియం పార్కులో 'తాటి మేళా' పేరుతో ప్రత్యేక మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, తాటి ఉత్పత్తుల ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే ఆ పార్కులో 250 రకాల తాటి మొక్కలను నాటినట్లు మంత్రి తెలిపారు. ఈ ఉత్సవం ద్వారా యువతలో కూడా తాటి సంస్కృతిపై అవగాహన పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కల్లును తెలంగాణ రాష్ట్ర పానీయంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను గుర్తు చేస్తూ, అక్కడ తాటి ఉత్పత్తులతో తయారయ్యే పానీయాలు, తాటి బెల్లం, తాటి ముంజెలతో చేసిన స్వీట్లు, స్నాక్స్ ప్రజాదరణ పొందుతున్నాయని చెప్పారు. అలాంటి కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించగలిగితే గీత కార్మికుల ఆదాయం పెరగడమే కాకుండా తాటి ఉత్పత్తులకు మార్కెట్ కూడా విస్తరించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నాయకులు కూడా తాటి వనాల సంరక్షణ అవసరాన్ని ప్రస్తావించారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయ వృత్తులను కాపాడుకోవడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబించే తాటి సంస్కృతికి మళ్లీ పూర్వ వైభవం తీసుకురావాలన్న ప్రభుత్వ సంకల్పం అమలైతే, గీత కార్మికుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

