న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్లో పతకంపై ఆశలు పెట్టుకున్న భారత పారా స్విమ్మర్ తేజస్ నందకుమార్కు చివరి క్షణంలో నిరాశ ఎదురైంది. బెంగళూరుకు చెందిన 20 ఏళ్ల తేజస్ పురుషుల ఎస్7 విభాగం 50 మీటర్ల ఫ్రీస్టైల్కు అర్హత సాధించి, అధికారిక జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.
అయితే అతని 'రివ్యూ-2025' క్లాసిఫికేషన్ హోదా కారణంగా కామన్వెల్త్ గేమ్స్కు అనర్హుడిగా ప్రకటించారు. కామన్వెల్త్ నిబంధనల ప్రకారం ఆటగాళ్లకు కన్ఫర్మ్డ్ క్లాసిఫికేషన్ లేదా కనీసం 2027 లేదా ఆ తర్వాత రివ్యూ తేదీ ఉండాలి. తేజస్కు 2025 రివ్యూ ఉండటంతో అవకాశం కోల్పోయాడు. ఈ నిర్ణయంపై తేజస్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఫిట్నెస్, ప్రతిభ లేదా ప్రదర్శనతో సంబంధం లేకుండా సాంకేతిక కారణాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపాడు. అవసరమైన క్లాసిఫికేషన్ కోసం గత 18 నెలల్లో బార్సిలోనా, పారిస్, ఆస్ట్రేలియాల్లో జరిగిన పోటీలకు వెళ్లినట్లు, పారిస్ పర్యటన ఖర్చును సైతం తానే భరించినట్లు వెల్లడించాడు. ఆసియా పారా గేమ్స్పై పూర్తిగా దృష్టి సారించి భారత్కు పతకం సాధించడమే తన తదుపరి లక్ష్యమని తేజస్ స్పష్టం చేశాడు.
కామన్వెల్త్ గేమ్స్కు సిద్ధమైన నీరజ్
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్కు సన్నద్ధమవుతున్నాడు. ఈ నెల 23 నుంచి స్కాట్లాండ్లో ప్రారంభమయ్యే కామన్వెల్త్ గేమ్స్కు ముందు స్విట్జర్లాండ్లోని బియెన్ (బియెల్)లో తన శిక్షణ కేంద్రంలో సాధన చేస్తున్నాడు. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్, గాయం కారణంగా 2022 బర్మింగ్హామ్ గేమ్స్కు దూరమయ్యాడు. ఈ ఏడాది జూన్లో దోహా డైమండ్ లీగ్లో 85.69 మీటర్ల త్రోతో నాలుగో స్థానంలో నిలిచిన అతడు, గ్లాస్గో గేమ్స్ను ఈ సీజన్లో రెండో ప్రధాన టోర్నీగా ఆడనున్నాడు.

