Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రైవేట్ నెట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు

ప్రైవేట్ నెట్ ఆపరేటర్లకు బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు

V6 Velugu 2 weeks ago

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సెప్టెంబర్ 1 నుంచి టీ--ఫైబర్ నెట్‌ సేవలు అందించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.

గడువు తర్వాత ప్రైవేట్ ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఎలాంటి బిల్లులు చెల్లించొద్దని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో టీ--ఫైబర్‌పై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

టీ--ఫైబర్ సేవలు వాడితే ప్రభుత్వానికి ప్రతి ఏడాది రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఆదా అవుతుందని మంత్రి తెలిపారు. టీ--ఫైబర్ ద్వారా సురక్షితమైన ఇంటర్నెట్ సదుపాయం అందుతుందని, రాష్ట్ర డేటా సెంటర్‌తో అనుసంధానం వల్ల ప్రభుత్వ డేటా మరింత భద్రంగా ఉంటుందని చెప్పారు. గత ఆరు నెలల్లోనే రాష్ట్రంలోని 4,487 ప్రభుత్వ కార్యాలయాలకు టీ--ఫైబర్ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు.

దీని వల్ల ఇప్పటికే ప్రభుత్వానికి దాదాపు రూ.13 కోట్ల వరకు ఆదా అయ్యిందన్నారు. మిగతా ప్రభుత్వ కార్యాలయాలకు కూడా టీ--ఫైబర్ సేవలు త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ వైడ్ ఏరియా నెట్‌వర్క్ (టీ--స్వాన్)ను నెల రోజుల్లో పూర్తిగా టీ--ఫైబర్‌కు మార్చాలని మంత్రి ఆదేశించారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీకి కూడా పూర్తి స్థాయి ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలని సూచించారు. అలాగే ఇంటింటికీ ఇంటర్నెట్ అందించే పనులను వేగంగా పూర్తి చేయాలని, ఇందుకోసం భాగస్వామిని ఎంపిక చేసేందుకు టెండర్లు పిలవాలని చెప్పారు. ఈ సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-ఫైబర్ ఎండీ వేణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News