PMAY-Urban 2.0 : పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన - అర్బన్ 2.0 (PMAY-Urban 2.0)లోని బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ (BLC) పథకం కింద రాష్ట్రంలో 17,912 ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.
ఈ ఇళ్ల నిర్మాణానికి మొత్తం రూ.447.8 కోట్ల వ్యయం కానుంది.
2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాలకు :
2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాలకు ఈ ఇళ్లను మంజూరు చేశారు. ఒక్కో ఇంటి యూనిట్ ఖర్చును రూ.2.50 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం అంటే రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం అంటే రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నాయి.

ఈ పథకంలో ప్రత్యేకత ఏమిటంటే.. లబ్ధిదారులే తమ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టే విధానం అమల్లో ఉంటుంది. పెద్ద నిర్మాణ సంస్థలకు అప్పగించకుండా, అర్హత పొందిన కుటుంబాలకు ప్రభుత్వం దశలవారీగా నిధులు అందించడం ద్వారా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని Central Sanctioning-cum-Monitoring Committee ఇప్పటికే వివిధ దశల్లో ఇళ్లకు అనుమతులు పరిశీలించింది. 2025-26లో 893 ఇళ్లకు రూ.22 కోట్లు, మరో 4,649 ఇళ్లకు రూ.116 కోట్లు, 2026-27లో 12,370 ఇళ్లకు రూ.309 కోట్ల ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంది.
అయితే ప్రభుత్వం నిర్ణయించిన రూ.2.50 లక్షల యూనిట్ వ్యయానికి మించి నిర్మాణానికి అయ్యే అదనపు ఖర్చును లబ్ధిదారులే భరించాల్సి ఉంటుంది. సిమెంట్, స్టీల్, కూలీల ధరలు పెరిగితే కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. మొత్తంగా, 17,912 ఇళ్లకు లభించిన ఈ అనుమతి పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చనుంది. ప్రభుత్వం నిధులను దశలవారీగా విడుదల చేసి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టనుంది.

