Free Gold : ఆధార్ కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ ప్రధాని నరేంద్ర మోదీ ఉచితంగా తులం బంగారం ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పూర్తిగా నకిలీది (Fake News).
ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ప్రభుత్వ అధికారిక సమచార సంస్థ పిఐబి ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) స్పష్టం చేసింది. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ ప్రధాని ప్రసంగించిన పాత వీడియోలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లేదా వాయిస్ మార్ఫింగ్ జోడించి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని సృష్టించినట్లు సైబర్ నిపుణులు మరియు పిఐబి విశ్లేషణలో తేలింది. ప్రధాని కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు ఇటువంటి ఎటువంటి పథకాన్ని ప్రకటించలేదని అధికారులు తేల్చిచెప్పారు.

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: అధికారిక సైట్లనే నమ్మాలని సూచన
సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి నకిలీ క్లిక్బైట్ వీడియోలు మరియు లింక్లను నమ్మి ప్రజలు మోసపోవద్దని పిఐబి హెచ్చరించింది. ఇటువంటి ఉచిత పథకాల పేరుతో వచ్చే అపరిచిత లింక్లపై క్లిక్ చేయడం ద్వారా ఆధార్, బ్యాంక్ ఖాతా మరియు వ్యక్తిగత వివరాలు సైబర్ కేటుగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీల గురించి సరైన సమాచారం కోసం కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక పోర్టల్స్ (myscheme.gov.in వంటివి) లేదా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రకటనలను మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలని సూచించారు.

