Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగస్టు నుంచి ఏపీలో సంజీవని ఆరోగ్య పథకం అమలు

ఆగస్టు నుంచి ఏపీలో సంజీవని ఆరోగ్య పథకం అమలు

వార్త 1 week ago

Sanjeevani Scheme: ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 'సంజీవని' హెల్త్ ప్రాజెక్ట్‌ను వచ్చే ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు.

“మీ ఆరోగ్యం.. మీ బాధ్యత” అనే నినాదంతో ప్రజల ముందుకు వస్తున్నామని, ప్రభుత్వం అందిస్తున్న ఈ గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరిలో ఏర్పాటు చేసిన ‘సంజీవని’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ముఖ్య అతితిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధునిక సాంకేతికతను జోడించి ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు రూపొందించిన ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాలను ప్రజలకు వివరించారు.

సమగ్ర ఆరోగ్య వ్యవస్థగా ‘సంజీవని’: డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ మరియు హెల్త్ ఐడీలు

ప్రస్తుత కాలంలో విద్య మరియు వైద్యం కోసం ప్రతి కుటుంబం కూడా తమ సంపాదనలో భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రజల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే పూర్తిగా భుజాన వేసుకునేలా ‘సంజీవని’ పథకానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి పౌరునికి ఒక ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను రూపొందించడంతో పాటు కుటుంబంలోని ప్రతి సభ్యుడికి హెల్త్ ఐడీలను జారీ చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) నుంచి రాష్ట్ర స్థాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల వరకు ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని ఒకే డిజిటల్ వేదికపైకి అనుసంధానం చేయడం దీని ప్రత్యేకత.

Sanjeevani Scheme: త్రిముఖ వ్యూహంతో ముందుకు: వ్యాధి నిర్ధారణ నుంచి ఏఐ వైద్య సేవల వరకు

కేవలం ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించడమే కాకుండా, వ్యాధులు రాకముందే ముందుగా గుర్తించడం (ప్రెడిక్టివ్), తగిన నివారణ చర్యలు చేపట్టడం (ప్రివెంటివ్), అవసరమైనప్పుడు అత్యుత్తమ నాణ్యమైన వైద్యం అందించడం (క్యూరేటివ్) అనే శక్తివంతమైన త్రిముఖ వ్యూహంతో సంజీవని సేవలు పనిచేస్తాయని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మంది ప్రజలు వివిధ రకాల తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని, ఈ దయనీయ పరిస్థితిని పూర్తిగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని అన్నారు. నాన్-కమ్యూనికబుల్ వ్యాధులు, మాతా-శిశు సంరక్షణ, 108-104 అత్యవసర సేవలు, ఈ-ఔషధి వంటి అన్ని వైద్య వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తెస్తామని వెల్లడించారు. అంతేకాకుండా భవిష్యత్తులో కృత్రిమ మేధ (AI) ఆధారిత వైద్య సహాయం, టెలీమెడిసిన్, రిమోట్ కేర్ వంటి అతధునిక సేవలను కూడా ఇందులో భాగం చేయనున్నట్లు తెలిపారు.

సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట: రాయలసీమకు భారీ పెట్టుబడుల హామీ

ప్రజారోగ్య రక్షణతో పాటు రాష్ట్రంలో సంక్షేమం, సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రతినెలా మొదటి తేదీనే క్రమం తప్పకుండా పింఛన్లు అందజేయడం, అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.20 వేల ఆర్థిక సాయం, తల్లికి వందనం, స్త్రీశక్తి, దీపం-2.0 వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో భూ రికార్డుల్లో సృష్టించిన గందరగోళాన్ని పూర్తిగా తొలగించేందుకు బ్లాక్‌చెైన్ టెక్నాలజీతో రీసర్వే ప్రక్రియను వేగవంతం చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి ఇది పూర్తవుతుందని స్పష్టం చేశారు. అలాగే 2028 నాటికి కడప స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తిని ప్రారంభించి, రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులతో రాయలసీమ ప్రాంతాన్ని ప్రధాన పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని భరోసా కల్పించారు.

గత పాలనపై విమర్శలు మరియు సాగునీటి ప్రాజెక్టులపై ప్రణాళిక

గత ఐదేళ్ల పాలనలో గొడ్డలి పార్టీ నేతలు ఒక్క ఎకరాకు కూడా అదనంగా సాగునీరు ఇవ్వలేదని, కనీసం ఒక్క కొత్త పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి ఉపాధి కల్పించలేదని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చు చేయని వారు ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రూ.1,768 కోట్ల అంచనా వ్యయంతో వేదవతి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ఈ ప్రాంత పొలాలకు సాగునీరు అందిస్తామని మాటిచ్చారు. రాష్ట్రంలో రాబోయే మూడేళ్లలో సుమారు 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేలా ఒక స్పష్టమైన ఇరిగేషన్ క్యాలెండర్‌ను రూపొందించామని వెల్లడించారు.

పరదాలు లేని పాలన: ప్రజల మధ్య ఉండే ‘కామన్ మ్యాన్’ సీఎం

బహిరంగ సభ ముగిసిన తర్వాత అదే వేదిక నుంచి ముఖ్యమంత్రి జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాను గత పాలకుల మాదిరిగా పరదాలు కట్టుకుని, చెట్లు నరికించి రహస్యంగా సభలు నిర్వహించడం లేదని, నేరుగా ప్రజల మధ్యలోకి వస్తున్నానని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అంటే కేవలం సెక్రటేరియట్‌లో ఏసీ గదుల్లో కూర్చునే వ్యక్తి కాదని, నిత్యం ప్రజల మధ్యే తిరిగే ఒక ‘కామన్ మ్యాన్’ అని ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా) మహిళలకు రూ.197 కోట్ల మెగా చెక్కును సీఎం అందజేశారు.

రాష్ట్రంలో కన్వీనర్‌ కోటాలో 1.35 లక్షల ఇంజినీరింగ్‌ సీట్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha