Withdrawal of Property Tax Hike: పట్టణాలలో ఆస్తి పన్ను పెంపు ఇప్పటికైనా ఆపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్. బాబూరావు డిమాండ్ చేశారు.
బుధవారం బాబూరావు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లొంగిపోయి 2020వ సంవత్సరంలో, నాటి వైసిపి ప్రభుత్వం పట్టణాలలో అద్దె విలువ ఆధారిత ఇంటి పన్ను (ఆస్తి పన్ను) స్థానంలో ఆస్తి విలువ ఆధారిత పన్ను (క్యాపిటల్ వాల్యూ) విధానాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. చట్ట సవరణ (44/2020) చేసిందని, 2020లో జీవో నెంబర్ 198 విడుదల చేసిందని తెలిపారు.
Read Also: AP Doctors Recruitment : వైద్య రంగంలో ప్రభుత్వ కీలక నిర్ణయం

Withdrawal of Property Tax Hike: ప్రభుత్వం ఇచ్చిన హామీల విస్మరణ
2021-22 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం ఆనాడు ఉన్న పన్నుపై 15 శాతం పెంచుతున్నారు అని తెలిపారు. టిడిపి (TDP) ఆనాడు ప్రతిపక్షంలో ఉండి క్యాపిటల్ వాల్యూ విధానాన్ని వ్యతిరేకించిందని, ఈ విధానాన్ని సమీక్షిస్తామని హామీ ఇచ్చిందని, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నది అని గుర్తు చేశారు. పన్నులు తగ్గిస్తామని ప్రజాప్రతినిధులు మాట ఇచ్చారని తెలిపారు. రెండు సంవత్స రాలు గడుస్తున్నా క్యాపిటల్ వాల్యూ విధానం రద్దు కాలేదని చెప్పారు. పన్నుల పెంపు ఆగలేదని అన్నారు. వైసిపి బాటలోనే కూటమి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇంటి పన్ను పెంచుతున్నదని ఆరోపించారు. గత ఐదు సంవత్సరాలలో ఇంటి పన్ను రెట్టింపు అయ్యిందన్నారు.
భవిష్యత్తు భారాలపై ఆందోళన
2026-27 ఆర్థిక సంవత్సరం ఇంటి పన్నుల డిమాండ్ నోటీసులు కొద్ది రోజుల్లో విడుదలవుతాయని తెలిపారు. గత శాసనసభ సమావేశాల్లో ఆస్తి పన్ను పెంపుపై చర్చ జరిగినా ప్రభుత్వం నోరు మెదపటం లేదు అని అన్నారు. మళ్లీ ఈ సంవత్సరం కూడా ఇంటి పన్ను పెంపుకు రంగం సిద్ధమయ్యిందన్నారు. 2021వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం పెరిగిన పన్నుపై 15 శాతం పెంచడం వలన దాదాపు ఇప్పటికే పన్ను పెంపు 30శాతానికి చేరిందని, ఇదేవిధంగా పెంపుదల కొనసాగితే 2029 నాటికి పన్ను పెంపు 45శాతానికి చేరుతుందన్నారు. రాష్ట్రంలోని 123 నగరాలు, పట్టణాల్లో ఉన్న ఆస్తి పన్ను డిమాండ్ 2021లో రూ.2450 కోట్లు కాగా నేడు రూ.3900 కోట్లకు చేరుకున్నదన్నారు.
ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తమ ఆదాయం కోసం ఆస్తి విలువలను పెంచి, అధిక రిజిస్ట్రేషన్ చార్జీలను వసూలు చేస్తున్నదన్నారు. ఆస్తి విలువలను ప్రభుత్వం పెంచడం వలన, దాని ఆధారంగా ఇంటి పన్ను నిరంతరం, ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుందని, దీనికి అంతం లేదు అని చెప్పారు. ఇళ్ల పట్టాలు లేని పేదల ఇళ్లను అక్రమ నిర్మాణాలుగా ముద్ర వేసి, పెంచిన పన్నుపై 100శాతం ప్రతి సంవత్సరం అధికంగా పెనాల్టీ వసూలు చేయటం దుర్మార్గమన్నారు. తక్షణమే ఆస్తి పన్ను పెంపు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

