Ambati Rambabu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అనారోగ్యంపాలయ్యారు. గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రముఖ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. అంబటి రాంబాబుతో మాట్లాడి, ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

విజయవంతంగా రెండు స్టెంట్లు అమర్చిన వైద్యులు
ఫోన్ సంభాషణ సందర్భంగా తనకు అపోలో ఆసుపత్రిలో అందిన వైద్యచికిత్స వివరాలను అంబటి రాంబాబు వైఎస్ జగన్కు వివరించారు. అనుకోకుండా ఆసుపత్రికి రావాల్సి వచ్చిందని, వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించిన అనంతరం గుండెకు రెండు స్టెంట్లు అమర్చినట్లు తెలిపారు. అపోలో వైద్య బృందం తనకు అత్యుత్తమ వైద్యం అందించిందని, ప్రస్తుతం తన ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
Ambati Rambabu: త్వరలోనే డిశ్చార్జ్ – ఒకటి రెండు రోజుల్లో సత్తెనపల్లికి రాక
ప్రస్తుతం అంబటి రాంబాబు వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూ/ప్రత్యేక గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం వేగంగా కుదుటపడుతుండటంతో ఒకటి రెండు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నట్లు సమాచారం. డిశ్చార్జ్ అయిన వెంటనే తాను త్వరలోనే సత్తెనపల్లికి వస్తానని జగన్కు ఆయన తెలిపారు. వైద్యుల సూచనల మేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.
Epaper: epaper.vaartha.com

