US Iran War: ఇరాన్, అమెరికా దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దిగజారాయి. బహ్రెయిన్లోని షేక్ ఇసా వైమానిక స్థావరంలో గల అమెరికా మౌలిక సదుపాయాలు, కీలక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ సైన్యం అధికారికంగా ప్రకటించింది.
ఈ దాడుల్లో యూఎస్ సైన్యానికి చెందిన పవర్ జనరేటర్లు, నావిగేషన్ వ్యవస్థలు మరియు కార్యాలయాలు దెబ్బతిన్నట్లు తమ అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది.

మునుపటి దాడులకు ప్రతీకార చర్య
గత బుధవారం రాత్రి అమెరికా తమ భూభాగాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్పష్టం చేసింది. అంతకుముందు కువైట్లోని అలీ అల్ సేలం, జోర్డాన్లోని అల్-అజ్రక్ వైమానిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైనిక ఆస్తులపై కూడా తాము దాడులు నిర్వహించినట్లు ఐఆర్జీసీ తెలిపింది.
US Iran War: హర్మూజ్ జలసంధి వివాదం
హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు ఇరాన్ పెను ముప్పుగా మారుతోందని ఆరోపిస్తూ అమెరికా గతంలో పలు ప్రాంతాలపై దాడులు జరిపింది. దీనికి కౌంటర్గా ఇరాన్ సైతం ఆయా ప్రాంతాల్లోని అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.
ఇతర దేశాలకు ఇరాన్ హెచ్చరికలు
ఈ ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ కీలక పరిణామాలు చేపట్టారు. తమపై దాడుల కోసం తమ భూభాగాలను అమెరికాకు ఉపయోగించుకోవడానికి అనుమతించవద్దని బల్గేరియా, సైప్రస్ దేశాలను ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ఆయన టెలిఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు. అయితే, తాము ఇరాన్తో ఎలాంటి యుద్ధంలోనూ భాగం కాబోమని, కేవలం దౌత్య మార్గాల ద్వారానే ఉద్రిక్తతలను చల్లార్చేందుకు మద్దతు ఇస్తామని బల్గేరియా మరియు సైప్రస్ దేశాలు స్పష్టం చేశాయి.
బ్రాడ్ పీక్ వద్ద హిమపాతం..ప్రముఖ పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా సహా 10 మంది గల్లంతు!

