Telugu Techie Dies In US: ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ తెలుగు యువకుడు అక్కడి ఆకస్మిక వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు.
కాన్సస్ రాష్ట్రంలో సంభవించిన వరద ప్రవాహంలో గల్లంతైన దొప్పలపూడి వెంకటేశ్ (32) మరణించినట్లు అక్కడి అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. కారుతో సహా వరదలో కొట్టుకుపోయిన ఆయన కోసం రెండు రోజుల పాటు గాలించగా.. చివరకు మృతదేహంగా లభ్యమయ్యాడు.
వరదలో కొట్టుకుపోయిన కారు.. రెండు రోజుల తర్వాత లభ్యమైన మృతదేహం
బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్, మూడేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడ మాస్టర్స్ పూర్తి చేసిన అనంతరం నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమాహా నగరంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా స్థిరపడ్డారు. అయితే శనివారం నాడు కాన్సస్లోని వెల్లింగ్టన్ సమీపంలో ఎస్. ఆలివర్ రోడ్డుపై కారులో ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి ఆయన వాహనం కొట్టుకుపోయింది. కారు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన ఒక ప్రత్యక్ష సాక్షి వెంటనే అత్యవసర విభాగం అధికారులకు సమాచారం అందించారు.
సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగినప్పటికీ, వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శనివారం రాత్రి వేళల్లో గాలింపును తాత్కాలికంగా నిలిపివేసి, ఆదివారం ఉదయం మళ్లీ ప్రారంభించారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిన చోటు నుంచి సుమారు 1.3 మైళ్ల దూరంలో వెంకటేష్ భౌతికకాయాన్ని సహాయక సిబ్బంది గుర్తించారు.
మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు నేతల చొరవ
కుమారుడి మరణవార్త వినగానే వెంకటేష్ తండ్రి దొప్పలపూడి రాంబాబుతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వెంకటేష్ ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు మొదట స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావును ఆశ్రయించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లతో పాటు నారా లోకేష్కు అత్యవసర లేఖలు రాశారు. అమెరికాలోని భారత రాయబార కార్యాలయంతో మాట్లాడి, గాలింపు చర్యలను వేగవంతం చేయడంతో పాటు, ప్రస్తుతం మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
షైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో విద్యార్థుల సమస్యలకు నారా లోకేశ్ భరోసా

