Adibatla CI Assault: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం ఒకవైపు.. శాంతిభద్రతలను కాపాడాల్సిన రక్షకభటుడే భక్షకుడిగా మారి విద్యార్థినులపై జరిపిన లాఠీచార్జ్ మరోవైపు..
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తుర్కయంజాల్ (Turkayamjal) లోని 'న్యూ శ్రీ చైతన్య కాలేజ్' (New Sri Chaitanya College) ఎదుట శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థినులపై ఆదిభట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) అనాగరికంగా, చట్టవిరుద్ధంగా దౌర్జన్యానికి దిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది.
Read also: BrahMos : దేవరకద్ర బ్రహ్మోస్ మిస్సైల్స్ తయారీకి సిద్ధం అవుతుందా ?
సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల శాంతియుత ధర్నా
బాధితులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కయంజాల్ పరిధిలోని సదరు న్యూ శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న పలువురు విద్యార్థినులు, ఉన్నత చదువుల కోసం తమ ఒరిజినల్ ఇంటర్ సర్టిఫికెట్లు (Inter Certificates) ఇవ్వాల్సిందిగా గత కొన్ని రోజులుగా కాలేజ్ యాజమాన్యం చుట్టూ తిరుగుతున్నారు. అయితే, వివిధ కారణాలు చెప్తూ కాలేజీ యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థినులను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది. సర్టిఫికెట్లు సకాలంలో చేతికి అందకపోతే తమ భవిష్యత్తు ఆగిపోతుందని ఆందోళన చెందిన విద్యార్థినులు, మంగళవారం ఉదయం కళాశాల ప్రధాన గేటు ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులతో శాంతియుతంగా ధర్నా చేపట్టారు.

అమ్మాయిలని చూడకుండా ఇష్టం వచ్చినట్లు బాదిన సీఐ
విద్యార్థుల ధర్నాతో కళాశాల ముందు కాసేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. సమాచారం అందుకున్న ఆదిభట్ల సీఐ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కనీసం లేడీ కానిస్టేబుళ్లను (Women Police) ముందుంచకుండా, నిరసన తెలుపుతున్నది ఆడపిల్లలనే కనీస మానవత్వం కూడా లేకుండా విద్యార్థినులను కొట్టిన ఆదిభట్లసీఐ.
కళ్లముందే తోటి విద్యార్థినులను సీఐ దౌర్జన్యంగా కొడుతుండటంతో అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. “సార్.. మేము అమ్మాయిలం సార్.. సర్టిఫికెట్ల కోసం అడుగుతున్నాం.. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు” అంటూ విద్యార్థినులు రోదించినా ఆ నిరంకుశ అధికారి శాంతించలేదు.
Adibatla CI Assault: వీడియోలు వైరల్ - సీఐపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాలేజీ అమ్మాయిలపై ఆదిభట్ల సీఐ జరిపిన లాఠీచార్జ్ మరియు దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలను అక్కడున్న కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలో వైరల్గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ప్రజా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చట్ట ప్రకారం మహిళలను, విద్యార్థినులను పురుష పోలీసులు తాకడమే నేరమని, అలాంటిది ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఉండి బహిరంగంగా రోడ్డుపై అమ్మాయిలను ఇష్టం వచ్చినట్లు కొట్టడంపై విద్యార్థి సంఘాలు, మహిళా కమిషన్ మండిపడుతున్నాయి.
తక్షణమే సదరు ఆదిభట్ల సీఐని విధులనుండి సస్పెండ్ చేయాలని, విద్యార్థినులపై లాఠీచార్జ్కు కారణమైన శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యంపై మరియు సదరు పోలీస్ అధికారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తుర్కయంజాల్ వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు భారీ ఎత్తున రాస్తారోకోకు దిగారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Epaper: epaper.vaartha.com
తెలంగాణలో 93 వేల పెన్షన్లు కట్.. వచ్చే నెల నుంచి కొత్త ఎంపిక!

