దూరదర్శన్ (Doordarshan) సీనియర్ న్యూస్ యాంకర్ (Announcer) సరళా మహేశ్వరి (71) కన్నుమూశారు. సౌమ్యమైన స్వరం, స్పష్టమైన ఉచ్చారణ, హుందాగా వార్తలు అందించే శైలితో ఆమె భారతీయ టెలివిజన్ జర్నలిజంలో ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఆమె మృతిపై దూరదర్శన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.

దూరదర్శన్ కుటుంబం తరఫున నివాళులు
దూరదర్శన్ కుటుంబం తరఫున సరళా మహేశ్వరికి హృదయపూర్వక నివాళులు. ఆమె తన సరళత, హుందాతనంతో వీక్షకులలో చెరగని ముద్ర వేశారు అని డీడీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. సరళాతో కలిసి పనిచేసిన సీనియర్ యాంకర్ షమ్మీ నారంగ్ కూడా ఆమె మృతిపై విచారం వ్యక్తం చేశారు. సరళా సౌజన్యానికి, మర్యాదకు ప్రతిరూపం. అపారమైన భాషా పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అని ఆయన పేర్కొన్నారు. ఆమె మృతితో టెలివిజన్ జర్నలిజంలో ఒక స్వర్ణయుగం ముగిసిందని మహిళా కాంగ్రెస్ అభివర్ణించింది.
1976లో ఢిల్లీ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తూనే సరళా మహేశ్వరి దూరదర్శన్లో న్యూస్ అనౌన్సర్గా (Announcer) కెరీర్ ప్రారంభించారు. లైవ్లో వార్తలు చదివిన తొలి తరం యాంకర్లలో ఆమె ఒకరు. 1984 వరకు డీడీలో పని చేసి, అనంతరం యూకేలో బీబీసీలో సేవలందించారు. 1988లో తిరిగి దూరదర్శన్లో చేరి, ప్రశాంతమైన, హుందా శైలితో ప్రతి ఇంట్లో విశ్వసనీయ యాంకర్గా గుర్తింపు పొందారు.

