Narendra Modi : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలిచిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం ప్రారంభించారు.
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టారు. సుమారు రూ.5,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ చూపనుందని ప్రభుత్వం భావిస్తోంది. పర్యాటకం, పరిశ్రమలు, ఐటీ, డేటా సెంటర్లు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు ఈ ఎయిర్పోర్ట్ కీలకంగా మారనుందని అంచనా.
ఇదే వేగంతో, ఇదే స్పూర్తితో ముందుకు సాగాలి :
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. కార్యక్రమం ముగిసిన అనంతరం ప్రధాని మోదీకి వీడ్కోలు పలికేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను ప్రధాని ప్రత్యేకంగా అభినందించినట్లు సమాచారం. “శభాష్ లోకేష్… బాగా పనిచేస్తున్నావ్. ఇదే వేగంతో, ఇదే స్పూర్తితో ముందుకు సాగాలి” అంటూ మోదీ ప్రశంసించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

భోగాపురం విమానాశ్రయం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించబడింది. భవిష్యత్ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తరణకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. విశాఖపట్నం ప్రాంతంలో పెరుగుతున్న విమాన రాకపోకలకు ఇది కీలక ప్రత్యామ్నాయంగా నిలవనుంది. అలాగే ఉత్తరాంధ్రలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు అంతర్జాతీయ అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో సుమారు రూ.18 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త అధ్యాయం మొదలైందని, భవిష్యత్లో ఈ ప్రాంతం పెట్టుబడులు, ఉపాధి, పర్యాటక రంగాల్లో వేగంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

