Bhagyalakshmi Temple : పాతబస్తీలోని చారిత్రాత్మక భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి, మహిమ ఏంటో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఇప్పుడు పూర్తిగా అర్థమైందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గతంలో భాగ్యలక్ష్మి ఆలయాన్ని, తన పర్యటనలను తీవ్రంగా అవహేళన చేసిన కేటీఆర్.. ఇప్పుడు అదే అమ్మవారి వద్దకు వచ్చి మోకరిల్లక తప్పలేదని ఎద్దేవా చేశారు. GHMC ఎన్నికల సమయంలో తాను భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తే, హిందూ-ముస్లింల మధ్య గొడవలు పెట్టడానికే వచ్చానంటూ తమపై విష ప్రచారం చేశారని ఆయన గుర్తుచేశారు. కానీ అమ్మవారి ఆగ్రహానికి, ఆమె మహిమకు భయపడే ఇప్పుడు కేటీఆర్ ముందస్తుగా వచ్చి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు.

అమ్మవారి దెబ్బకు దిగొచ్చిన నాయకులు: పాతబస్తీలో కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్, రాజకీయ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కేటీఆర్తో పాటు రేవంత్ రెడ్డి, కవిత కూడా అమ్మవారి విషయంలో ఇదే తరహా వైఖరి ప్రదర్శించారని, కానీ చివరికి అమ్మవారే తన శక్తితో వారందరినీ తన వద్దకు రప్పించుకున్నారని అన్నారు. అమ్మవారిని, హిందూ విశ్వాసాలను చిన్నచూపు చూసిన ప్రతి ఒక్కరికీ కాలమే సరైన సమాధానం చెప్పిందని వ్యాఖ్యానించారు. భక్తి అనేది రాజకీయం కోసం కాదు, అమ్మవారి దివ్య శక్తి ముందు ఎంతటి రాజకీయ నాయకులైనా శిరస్సు వంచాల్సిందేనని ఈ సందర్భంగా బండి సంజయ్ పునరుద్ఘాటించారు.

