Sabari Express: మూవింగ్ ట్రైన్లో ఊహించని దారుణం చోటుచేసుకుంది. భార్య, బంధువులు తనను బలవంతంగా ఊరికి తీసుకెళ్తున్నారనే ఆందోళనతో.. భార్య కళ్లెదుటే భర్త, అతని ప్రియురాలు రైలు బాత్రూమ్లో గడ్డిమందు (పురుగుల మందు) తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
శబరి ఎక్స్ప్రెస్ రైలు చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే ఈ ఘోరం జరిగింది. సికింద్రాబాద్ రైల్వే పోలీసులు (RPF) తెలిపిన వివరాల ప్రకారం ఈ సంచలన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also :Mumbai Airport: ముంబై రన్వేపై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..అసలేం జరిగిందంటే?
శ్రీకాకుళం టు హైదరాబాద్.. ఆపై కోయంబత్తూరు

ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఛప్రా గ్రామానికి చెందిన శిరీశ్కుమార్ (34) అనే ఆటో డ్రైవర్కు సులోచనతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన ఒక వివాహిత (34)తో శిరీశ్కు పరిచయం ఏర్పడింది. సదరు వివాహిత భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో, ఆమె తన పిల్లలతో కలిసి హైదరాబాద్ మూసాపేటలోని తన సోదరి ఇంట్లో నివాసముంటోంది. తరచూ ఆమెను కలిసేందుకు శిరీశ్కుమార్ శ్రీకాకుళం నుంచి హైదరాబాద్కు వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో నెల రోజుల కిందట వీరిద్దరూ ఎవరికీ చెప్పకుండా మాయమయ్యారు.
కోయంబత్తూరులో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య
తన భర్త ప్రియురాలితో కలిసి వెళ్లిపోయినట్లు నిర్ధారించుకున్న భార్య సులోచన.. వారి కోసం తీవ్రంగా గాలించడం ప్రారంభించింది. వారు తమిళనాడులోని కోయంబత్తూరులో కలిసి నివాసముంటున్నట్లు పక్కా సమాచారం అందడంతో.. సులోచన తన బంధువులతో కలిసి అక్కడికి వెళ్లి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అనంతరం అక్కడ పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ చేసి, వారిద్దరినీ తీసుకుని సోమవారం మధ్యాహ్నం కోయంబత్తూరులో ‘శబరి ఎక్స్ప్రెస్’ రైలు ఎక్కి హైదరాబాద్కు బయలుదేరింది.
Sabari Express: రైలు బాత్రూమ్లోనే ఘాతుకం
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో రైలు చర్లపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోకి చేరుకుంది. కొద్దిసేపట్లో రైలు సికింద్రాబాద్ చేరుకుంటుందనగా.. శిరీశ్కుమార్, అతడి ప్రియురాలు ఇద్దరూ కలిసి ఒకేసారి బాత్రూమ్లోకి వెళ్లారు. ఊరికి వెళ్లడం ఇష్టం లేక, తాము ముందే వెంట తెచ్చుకున్న గడ్డి మందు ద్రావణాన్ని బాత్రూమ్లో ఇద్దరూ తాగేశారు. అనంతరం వారు బయటకు వచ్చి అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో భార్య సులోచన గమనించి గట్టిగా కేకలు వేసింది.
తోటి ప్రయాణికుల సహాయంతో వెంటనే సికింద్రాబాద్ ఆర్పీఎఫ్ పోలీసులకు సమాచారం అందించారు. రైలు సికింద్రాబాద్ స్టేషన్కు రాగానే పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న శిరీష్, అతడి ప్రియురాలిని హుటాహుటిన సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న వీరిద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

