YS Jagan: ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
“కుటుంబాలు, చిన్నారులతో కలిసి ప్రజలు ప్రశాంతంగా గడిపే బీచ్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం వదలడం లేదు. అక్కడ బీచ్ షాక్స్ (Beach Shacks) పేరుతో కొత్త మద్యం సంస్కృతికి తెరలేపుతోంది” అంటూ ఆయన మండిపడ్డారు. తాడేపల్లిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వ నిర్ణయాలు రాష్ట్ర సామాజిక వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టేలా ఉన్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: President Droupadi Murmu: రాష్ట్రపతికి ధర్మవరం చేనేత చీర కానుక
Jagan’s sharp comments on alcohol culture at beaches.
YS Jagan: సామాన్య కుటుంబాలు బీచ్లకు ఎలా వెళ్తాయి?
బహిరంగ ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాల్లో మద్యం విక్రయాలను ప్రోత్సహించడం పట్ల వైఎస్ జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రదేశాల్లో లిక్కర్ సంస్కృతిని తీసుకొస్తే.. రేపు పొద్దున సామాన్య కుటుంబాలు, ఆడపిల్లలు ధైర్యంగా బీచ్లకు ఎలా వెళ్తారని ఆయన కూటమి సర్కార్ను నిలదీశారు. ఆదాయమే పరమావధిగా భావిస్తూ ప్రజల రక్షణను, సంస్కృతిని పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టడం, వేధింపులకు గురిచేయడం పరిపాటిగా మారిందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో చివరకు లాకప్ డెత్ల (Custodial Deaths) వంటి దారుణాలు కూడా జరుగుతున్నాయని, వీటికి ప్రభుత్వ వైఫల్యాలే కారణమని విమర్శించారు. “చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా?” అని జగన్ ఘాటుగా ధ్వజమెత్తారు.
పెట్టుబడులు రావు.. దోపిడీ సొమ్ము విదేశాలకు!
రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించే చేతగాని ఈ ప్రభుత్వం… కేవలం అవినీతి, దోపిడీ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని దుయ్యబట్టారు. “రాష్ట్రానికి కొత్తగా ఎలాంటి విదేశీ పెట్టుబడులు రావడం లేదు కానీ, ఇక్కడ దోచుకున్న సొమ్ము మాత్రం విదేశాలకు వెళ్తోంది” అంటూ జగన్ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Epaper: epaper.vaartha.com

