Beedi workers children scholarship 2026: బీడీ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల పిల్లలు చదువుల్లో రాణించేలా ప్రోత్సహించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
2026-27 విద్యాసంవత్సరానికి గాను ప్రత్యేక ఉపకారవేతనాలను (స్కాలర్షిప్స్) అందిస్తోంది. అయితే, ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ చేయడంతో చాలా మంది కార్మిక కుటుంబాలకు దీనిపై సరైన అవగాహన కరవైంది. ఫలితంగా ఎంతో మంది అర్హులైన విద్యార్థులు ఈ ప్రయోజనానికి దూరమవుతున్నారు. అర్హత కలిగిన బీడీ కార్మికుల పిల్లలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
Read also: Kamareddy Student Died In London: లండన్లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి!
Central scholarships for beedi workers’ children… Here is how to apply.
Beedi workers children scholarship 2026: ఎవరెవరు అర్హులు?
- ఈ స్కాలర్షిప్ పొందడానికి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్రింది అర్హతలు ఉండాలి:
- 1వ తరగతి నుంచి 10వ తరగతి (ప్రీ-మెట్రిక్), అలాగే ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, బీటెక్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు (పోస్ట్-మెట్రిక్) చదువుతున్న వారు అర్హులు.
- టెన్త్, ఇంటర్లో మొదటి ప్రయత్నంలోనే (ఫస్ట్ అటెంప్ట్) ఉత్తీర్ణులైన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది.
- కేవలం రెగ్యులర్ విధానంలో చదివేవారికే అర్హత ఉంది. దూరవిద్య (డిస్టెన్స్ ఎడ్యుకేషన్) విధానంలో చదివే వారికి ఈ స్కాలర్షిప్ వర్తించదు.
- ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే కార్మికుల పిల్లలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఆయా పాఠశాలలు ప్రభుత్వం నుంచి పొందిన రికగ్నిషన్ సర్టిఫికేట్ (పాఠశాల గుర్తింపు పత్రం) సమర్పించాల్సి ఉంటుంది.
- తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బీడీ రంగంలో కనీసం 6 నెలల పని అనుభవం కలిగి ఉండాలి.
- కుటుంబ నెలకు వచ్చే ఆదాయం రూ.10,000 మించకూడదు.
తరగతుల వారీగా లభించే స్కాలర్షిప్ వివరాలు
విద్యార్థులు చదువుతున్న కోర్సు లేదా తరగతిని బట్టి కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ఇలా ఉంది.
| తరగతి / కోర్సు | లభించే స్కాలర్షిప్ మొత్తం |
| 1 నుంచి 4వ తరగతి | రూ. 1,000 |
| 5 నుంచి 8వ తరగతి | రూ. 1,500 |
| 9 మరియు 10వ తరగతి | రూ. 2,000 |
| ఇంటర్మీడియట్ | రూ. 3,000 |
| డిగ్రీ, ఐటీఐ, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు | రూ. 6,000 |
| బీటెక్, బీఏఎంఎస్ మరియు తదితర కోర్సులు | రూ. 25,000 |
ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు విధానం
అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) ద్వారా ఆన్లైన్లో ఇలా దరఖాస్తు చేసుకోవాలి:
- మొదట అధికారిక వెబ్సైట్ scholarships.gov.in ను సందర్శించాలి.
- హోంపేజీలో ఉన్న ‘స్టూడెంట్స్’ సెక్షన్పై క్లిక్ చేయాలి.
- అక్కడ అందుబాటులో ఉన్న ‘వన్ టైమ్ రిజిస్ట్రేషన్’ ఆప్షన్ను ఎంచుకోవాలి.
- మీ యాక్టివ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి, దానికి వచ్చే ఓటీపీ (OTP) మరియు స్క్రీన్పై ఉన్న క్యాప్చా కోడ్ను నమోదు చేయాలి.
- ఆ తర్వాత మీ ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలి.
- ప్రక్రియ ముగియగానే మీ మొబైల్కు ఎస్ఎమ్ఎస్ (SMS) ద్వారా ఓటీఆర్ (OTR) నంబర్ వస్తుంది. దీని ద్వారా లాగిన్ అయి దరఖాస్తు పూర్తి చేయవచ్చు.
దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా సందేహాలు ఉంటే పరిష్కరించుకోవడానికి హెల్ప్లైన్ నంబర్: 0120-6619540 ను సంప్రదించవచ్చు లేదా helpdesk@nsp.gov.in కు ఈమెయిల్ చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు
కార్మికుల పిల్లలు తమ దరఖాస్తులను గడువు ముగిసేలోగా సమర్పించాల్సి ఉంటుంది. (1 నుంచి 10వ తరగతి) దరఖాస్తుకు చివరి తేదీ 31 ఆగస్టు 2026, పోస్ట్-మెట్రిక్ విద్యార్థులకు (ఇంటర్, డిగ్రీ, ఉన్నత చదువులు): దరఖాస్తుకు చివరి తేదీ 31 అక్టోబరు 2026. కార్మిక కుటుంబాల పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇటువంటి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అర్హులైన వారంతా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాం. దరఖాస్తు విషయంలో ఎలాంటి సందేహాలున్నా ఆలేరులోని బీడీ కార్మిక సంక్షేమ ఆసుపత్రిలో మమ్మల్ని స్వయంగా కలిసి నివృత్తి చేసుకోవచ్చు.
వేలాది మంది విద్యార్థులకు వరం
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కాలర్షిప్ పథకం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది మంది బీడీ కార్మిక కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఆసరా లభించనుంది. అయితే, ఇటీవలి కాలంలో డిజిటల్ విధానంపై అవగాహన లేక చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఈ పథకం వంద శాతం మంది అర్హులకు చేరాలంటే గ్రామీణ ప్రాంతాల్లోని బీడీ కార్మికుల్లో దీనిపై మరింత విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గుడ్ న్యూస్! తెలంగాణలో 24 డీఈవో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

