Medak Chilapally Theft Case: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం చిలపల్లి గ్రామంలో సంచలనం సృష్టించిన భారీ దొంగతనం కేసును జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా, వేగంగా ఛేదించారు.
ఈ కేసులో రూ. 1 కోటి 35 లక్షల విలువైన భారీ మొత్తంలో బంగారం, వెండి వస్తువులను రికవరీ చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు.
ఐదు ఇళ్లే లక్ష్యంగా భారీ దోపిడీ.. 5 ప్రత్యేక బృందాల వేట
ఈ నెల 14వ తేదీ రాత్రి చిలపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఐదు ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు, తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇందులో ఒకే ఇంట్లో ఏకంగా 109 తులాలు 9 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి వస్తువులు, రూ. 19 వేల నగదును దోచుకెళ్లారు. అలాగే మరో ఇంట్లో మూడు తులాల బంగారాన్ని అపహరించారు. ఈ ఉమ్మడి చోరీని సవాల్గా తీసుకున్న పోలీసులు.. ఎస్పీ ఆదేశాల మేరకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
Grateful theft victims honoring Medak police officers with shawls for recovering their lost gold jewellery
రామాయంపేట వద్ద ప్రధాన నిందితుడి అరెస్ట్.. 17 కేసుల్లో ప్రమేయం
సాంకేతిక ఆధారాలు, నిఘా వర్గాల గూఢచారి సమాచారంతో దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక బృందాలు రామాయంపేట సమీపంలో ప్రధాన నిందితుడు జాదవ్ జైరాం నాయక్ అలియాస్ జెమ్లా నాయక్ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడి వద్ద నుండి 929.7 గ్రాముల బంగారం, 1.7 కిలోల వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితుడు పాత నేరస్థుడని, అతడిపై ఇప్పటికే పలు జిల్లాల్లో అనేక దొంగతనం కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. శంకరంపేట-ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5 కేసులతో పాటు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో జరిగిన మరో 12 చోరీ కేసుల్లోనూ ఇతడి ప్రమేయం ఉన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడని ఎస్పీ వివరించారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Medak Chilapally Theft Case: పోలీసులకు బాధితుల సన్మానం..
కోల్పోయిన కోట్లాది రూపాయల సొత్తును తిరిగి అప్పగించడంతో బాధితులు రాములు, మాణిక్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తమ సొమ్ము మళ్లీ దొరుకుతుందని ఆశించలేదని, రాత్రింబవళ్లు శ్రమించి న్యాయం చేసిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలుపుతూ ఎస్పీతో పాటు దర్యాప్తు బృందాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. తమ గ్రామంలో త్వరలోనే సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటామని బాధితులు హామీ ఇచ్చారు. ఈ కేసును వేగంగా ఛేదించిన ఐదు ప్రత్యేక బృందాల అధికారులకు, సిబ్బందికి ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు నగదు పురస్కారాలు, రివార్డులను అందజేశారు.
Hunt for the main accused in the Chilapalli case concludes SP announces.
ఇళ్లకు తాళాలు వేసే ముందు పోలీసులకు చెప్పండి: ఎస్పీ సూచన
ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి శుభకార్యాలకు లేదా ఊర్లకు వెళ్లే సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ముందస్తు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. నివాస ప్రాంతాల్లో, గ్రామాల్లో కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, విలువైన బంగారు ఆభరణాలను ఇంట్లో ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలని కోరారు. ఏదైనా అత్యవసర సహాయం లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, సీఐలు రేణుక రెడ్డి, జార్జ్, సందీప్ రెడ్డి, ఎస్ఐలు శంకర్, ప్రవీణ్ రెడ్డి, పోచయ్య మరియు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

