Dailyhunt
ధాన్యం కొనలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం - కేసీఆర్

ధాన్యం కొనలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం - కేసీఆర్

వార్త 1 week ago

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనలేని అసమర్థ స్థితిలో ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వం ఎంతో క్రమబద్ధంగా నిర్వహించిన ఈ ప్రక్రియ, ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యం వల్ల గాడి తప్పిందని ఆయన ధ్వజమెత్తారు.

Read Also : TG Rain Alert: రానున్న 2 గంటల్లో వర్షం.. ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

‘చిల్లర ప్రభుత్వం’ అంటూ తీవ్ర విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తప్పుబడుతూ కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని ‘చిల్లర ప్రభుత్వం’ అని అభివర్ణించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, స్థాయికి తగని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాలనపై పట్టు కోల్పోయి, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని, ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ఆయన నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించి, రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని డిమాండ్ చేశారు.

జాతీయ వేదికలపై తెలంగాణ ఆత్మగౌరవం

ఇతర రాష్ట్రాల ఎంపీలు తెలంగాణను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ మరియు బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటాన్ని కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, ఇక్కడి ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్న ఎంపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడటంలో ప్రస్తుత ఎంపీలు విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha