ప్రభుత్వాల మధ్య గొడవులు వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు గత కాలంలో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో కూడా పెద్దగా ఉండకపోయేవి.అటు తర్వాత కొన్ని సంవత్సరాల వరకూ రాజకీయ నాయకుల మధ్య తగాదా లు రాజకీయాల వరకే పరిమితమ య్యాయి.
అంతేగాని రాయలసీమను ఫాక్షన్ తరహాలో మొహమొహాలు చూసుకోని పరిస్థితి లేదు. కానీ ఈ మధ్యకాలంలో రాష్ట్రాలలోనే కాదు కేంద్రం వరకూ ఈ ఫాక్షన్ రాజకీయాలు విస్తరించడం దురదృష్టకరం. ఇప్పుడు వ్యవస్థలకు కూడా అంటుకుంటున్న ప్రమాదకర ధోరణి కళ్లకు కొట్టొచ్చినట్లు కనపడుతుండటం మరింత దురదృష్ట కరం. వెస్టెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ప్రధాని మోడీలాగానే జనంతో, అధికారంలో వారి అభిమానంతో ఉన్న నాయకురాలు! అదే విధంగా ఫెడరలిజం ప్రజాస్వా మ్యం రాజ్యాంగంలో పొందుపర్చుకున్న భారత్ ఆ విధానా లను సర్వదా, శతథా ఆచరించాలని అనుకోవటంలో ఇసు మంతైనా తప్పులేదు! అధికారాలను రాజ్యాంగ ప్రకారం శాసనాలు చేసే వ్యవస్థ, వారి పాలన చేసే వ్యవస్థ, న్యాయాన్ని కాపాడే వ్యవస్థలుగా విభజింపబడి రాజ్యాం గానికి లోబడి వ్యవహరించే వ్యవస్థలు స్వాతంత్ర్యం ముందూ అటు తర్వాత స్వతంత్ర పాలనలో కూడా ఏర్పడినప్పుడు దేశ పాలన కానీ, రాష్ట్ర పాలన కానీ అందుకనుగుణంగా నడవక తప్పదు. ఇలాంటి అవగాహనతో భారతదేశంలో పాలన సాగుతున్నప్పుడు వెస్టెంగాల్ రాష్ట్ర సి.యం ఇ.డి (Enforcement Department)లు తన పార్టీ రాజకీయ ఎలక్షన్ కమిటీ వ్యవహారాల్లో దర్యాప్తు నిమిత్తం జక్యం చేసుకోవటాన్ని బాహాటంగా ఖండిస్తూ ఇ.డి దాడులను భౌతికంగా నిలిపేసేందుకు తన పార్టీ మద్దతుదారులతో ప్రయత్నించింది.

అప్రజాస్వామిక చర్య
జనవరి 8 నాడు ఇది జరిగింది. ఇ.డి కోల్కత్తా లోని ఈ కమిటీ లొకేషన్లలో 2021 ఎన్నికల ముందు చేసిన దాడుల మాదిరే రాబోయే ఎన్నికల ముందు కూడా ఇలాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపట్టటాన్ని బాహాటంగా ఇదొక అప్రజాస్వామిక చర్యగా, ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ రాజకీయ ఎత్తుగడలను దాడుల నెపంతో కేంద్రంలోని బిజెపి తెలుసుకొని ఆడించే ప్రయత్నంగా అభివర్ణిస్తూ బాహాబాహీ పోరాటానికి దిగింది. మమతా బెనర్జీ ఆవేశంతోపాటు సమయాను కూలంగా తన పార్టీ అస్తిత్వానికి ఎంతకైనా తెగించి పోరాడే మనస్తత్వం కలిగిన రాజకీయ నాయకురాలిగా పేరు తెచ్చుకుంది. ఇండి యన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఇ.పి.ఎసి)గా రూలింగ్ తృణమూల్ కాంగ్రెస్ 'టి.యం.సి) పార్టీ ఎన్నికల ప్రచారా న్ని పొలిటికల్ కన్సల్టెన్సీ పేరుతో తీర్చిదిద్దే వ్యవస్థగా భావించవచ్చు. ఈ లొకేషన్లలో దాడులు మనీలాండరింగ్ దర్యాప్తుకోసమని ఎన్నికలకు సంబంధించిన దాడులు కానే కావని, ఇ.డి (Enforcement Department) ప్రకటించిన నేపథ్యంలో ఈ విషయం చినికి చినికి గాలి వానగా మారి ప్రజాస్వామ్య పాలనకు ఆటంకం కలిగించే బిజెపి ఎత్తుగడగా ప్రచారం జరుగుతుండటంతో విపరీతమైన సమస్యలు తలెత్తే అవకాశాన్ని విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు. ఈ దాడులు ప్రజాస్వామ్యం మీద దాడి అని యాక్షన్ కమిటీ ఆఫీసు ముందు ప్రొటెస్టు చేసిన మమతా బెనర్జీ కేంద్రప్రభుత్వాన్ని విమర్శించి కేంద్రదర్యాప్తు వ్యవస్థలను అప్రజాస్వామికంగా వినియోగించుకొని ప్రతిపక్ష పార్టీలను సమూలంగా నిర్మూలించే ఎత్తుగడ అని అనటం కూడా విపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. అయితే ఇ.డి మాత్రం తను అధికారులను అడ్డుకున్నారని డాక్యుమెంట్లను ఏక కంఠంతో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు పేరుతో సిబిఐ ప్రజా స్వామ్య విలువలను కాలరాస్తూ వినియోగించుకుంటున్నదని వ్యతిరేకిస్తున్నారు.
ఇది సమయమా?
ఎవరు వాస్తవాలు చెబుతున్నారు? ఎవరు వక్రీకరిస్తున్నారన్న అంశాన్ని పక్కకు పెట్టి విషయాన్నిలోతు గా మథనం చేస్తే ఒక స్పష్టమైన అవగాహన బహిర్గతమవు తుంది. సమయాసమయాలు ఏ ప్రధాన నాయకుడైనా ఇటు రాష్ట్రాలు పాలించే వారు కానీ, అటు కేంద్ర పాలన చేసే వారు కానీ పాలించక తప్పదు. ప్రజాస్వామ్యం దేశంలో పదికాలాల పాటు నిలబడాలంటే అధికార పక్షం విపక్షాలూ కూడా నిలబడగలిగి ఉండాలి. ఎన్నికలల్లో నిజాయితీగా ఏ పార్టీ అటు ప్రజల మెప్పుతో, ఓట్లతో గెలవాలంటే ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించబడాలి. ఇడి ఇలాంటి చర్య అదీ ఎన్నికలు అతి త్వరలో నిర్వహించబోతున్నప్పుడు ఒక పార్టీ రాజకీయంగా న్యాయబద్ధంగా ఎన్నికలలో పాల్గొనబోయే ముందు ఎన్నికల కార్యాచరణను, ఎత్తుగడలను సమీకరించుకొనే కేంద్రాల మీద దాడులు మనీలాండరింగ్కు సంబంధిం చిన ఆరోపణలను దర్యాప్తు కోసం దాడులు చేయటానికి ఇది సమయమా? ఇది సందర్భోచితమా? న్యాయబద్ధంగాఆలోచించే సామాన్యుడికైనా ఈ చర్య తప్పు అని అనుకోవటాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. కేంద్ర, రాష్ట్రాల సంబంధాలను దెబ్బతీసే చర్యగానే ఎవరైనా భావిస్తారు. ఎన్నికల కోసం డబ్బుల వినియోగంతోపాటు ఫండింగ్ ఎంతవరకు సహేతుకంగా జరు గుతున్నదన్న సందేహం ఎవరికైనా కలగకమానదు. ఎన్నికల్లో పోటీ చేసే అన్ని పార్టీలకూ, అధికారంలో ఉన్న పార్టీతో సహా, ఏపార్టీకీ ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకీ, మొగ్గుచూపకుండా ఎన్నికలు సజావుగా నడిపే విధంగా కేంద్ర ప్రభుత్వం ఉండక తప్పదు. కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణలలో కూడా ఆ దృక్పథాన్ని మెరుగైన రీతిలోచూపాలి. ఆవిధంగా ప్రభుత్వా లు చేస్తున్నాయి అనే బలమైన నమ్మకం ప్రజలకూ, ఓటర్ల కూ అన్ని పార్టీల వారికీ కలిగినప్పుడే కొన్ని పొరుగుదేశాల్లో మాదిరి ఎన్నికల నిర్వహణ భ్రష్టుపట్టలేదు. సజావుగా నిజాయితీగా న్యాయ బద్ధంగా ఆ అధికారంలో ఉన్నప్పుడు ఉండే అవకాశాలను దుర్వినియోగం చేయకుండా చట్టాలను అతిక్రమించకుండా కేంద్ర ప్రభుత్వం అందరికీ సమాన అవకాశా లతో ఏ వ్యవస్థనూ వాడుకోకుండా (ముఖ్యంగా ఇ.డి, సిబిఐ ఎన్నికల కమిషన్ లాంటి) ఎన్నికలను నిర్వహించాలి. అంతే కాదు ఆ విధమైన బలమైన విశ్వాసాన్ని అందరికీ కలిగించాలి.

కేంద్రాన్ని తప్పుపట్టటం సమంజసం కాదు
కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఉండాల్సిన బాధ్య తలను ఎత్తిచూపుతున్నప్పుడు ప్రతిపక్షాల విధులూ బాధ్య తలను ఎత్తి చూపడం, విస్మరించి ఏకపక్షంగా ఒక్క కేంద్రాన్ని తప్పుపట్టటం సమంజసం కాదు. ప్రతిపక్షాలు ఈ మధ్య ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నాయి. పెద్ద పెద్ద పదాలను వాడుతూ ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్య మంత్రుల పదవులను అగౌరవపరుస్తున్నారు. 'చోర్' అన్న పదం అధి కారంలో ఉన్న పార్టీని కానీ, ప్రధానిని ఉద్దేశించి కానీ వాడ టం ఏ విధంగా చూడాలి? వాదనలో పసఉంటే పడికట్టు పదాలు అనవసరపు వర్ణనాపూరిత మాటలు అవ సరం లేనే లేదు. నిజాలను వెలికి తీసి వ్రేలెత్తిచూపాలి. అర్థ సత్యా లనూ, అసత్యాలను నిజాలను నమ్మబలకడం ఈ ఆధునిక సాంకేతిక యుగంలో కొంతకాలం చెల్లినా ఎల్ల కాలం చెల్లదు. రాజకీయాల్లో గౌరవప్రదంగా బాధ్యతల నిర్వహణ ఏ పదవికైనా పదవీ లేకపోయినా వన్నెతెస్తుంది. రాజకీయాల్లో ఇంతవరకు మునుపు సహజ చతురోక్తులూ సాంప్రదాయాలు, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవటాలూ, రాజ కీయ వాసనలేని కార్యక్రమాల్లో హుందాగా పాల్గొని పద వులూ హోదాలు కావు ముఖ్యం. సమత్వం సమదృష్టి నిజాయితీతత్వం ముఖ్యం అని ఆనాటి నాయకుల ప్రవర్తన తీరులో స్పష్టంగా ద్యోతక మయ్యేది. ఈనాటి రాజకీయాల్లో పెద్ద పదవులు అనుభవిస్తున్నవారు కూడా తక్కువ స్థాయి లో, నీచపదాలతో అసభ్యకరంగా వ్యవహరించటంచూస్తుంటే జాలివేస్తున్నది. అందుకనే రాజకీయాల్లో ఉన్నవారి పట్ల తేలిక భావం ప్రజల్లో ఏర్పడుతున్నది. ప్రజాస్వామ్యంలో పాలన 'నమ్మకం' పైఆధారపడి ఉంది. ఎవరు, ఎంత పెద్ద పదవిలో ఉన్నా ప్రొటెస్టు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు విషయాన్ని అగౌరవ పర్చకుండా వ్యక్తం చేయటమే ముఖ్యం. అప్పుడు అసలు విషయం మరుగునపడదు. అలా కానప్పు డు అసలు పోయి 'కొసరు' మిగిలి రసాభాస పర్వం ఆవిష్కరించబడుతుంది. తస్మాత్ జాగ్రత్త.
-రావులపాటి సీతారాం రావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com

