YS Jagan: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ (Mega DSC) పరీక్షలు, ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ మెగా స్కామ్పై నిష్పక్షపాతంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తాజా మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. డీఎస్సీ ఫలితాలు, నియామకాలపై వెలుగులోకి వస్తున్న అంశాలు నిరుద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Chandrababu Lokesh DSC Controversy
‘లక్షలాది మంది నమ్మకాన్ని వమ్ము చేశారు’.. చంద్రబాబుపై జగన్ ఘాటు విమర్శలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడుతూ లక్షలాది మంది ప్రతిభావంతులైన అభ్యర్థుల నమ్మకాన్ని, వారి జీవితాలను దెబ్బతీసిందని జగన్ మండిపడ్డారు. ఇంతటి అపారదర్శక నియామక ప్రక్రియను చరిత్రలో ఎక్కడా చూడలేదని విమర్శించారు. “అబద్ధాలు, మోసాలు, వెన్నుపోట్లకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు” అని దుయ్యబట్టారు. యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఉపాధ్యాయ కొలువుల భర్తీలో కూడా అవినీతికి పాల్పడటం అత్యంత దారుణమన్నారు.
read also: YS Jagan: రేపు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన ర్యాలీలు.. జగన్ కీలక పిలుపు
YS Jagan: 'మేమూ బొద్దింకలమే.. జెన్ జెడ్ చూస్తోంది!'
ప్రభుత్వం సాగిస్తున్న అక్రమాలను నేటి తరం యువత (Generation Z) నిశితంగా గమనిస్తోందని జగన్ హెచ్చరించారు. “చంద్రబాబూ గుర్తుంచుకో.. ఇది జెన్ జెడ్, జెన్ ఆల్ఫా తరం. తప్పులను కప్పిపుచ్చుకుంటూ ఇబ్బంది పెడితే బొద్దింకలు కూడా తిరగబడతాయి” అని వ్యాఖ్యానించారు. దేశంలో నీట్ పేపర్ లీక్ తర్వాత వెలిసిన 'జనతా కాక్రోచ్ పార్టీ' (CJP) ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ.. “ఆంధ్రప్రదేశ్లో యువతకు అన్యాయం జరిగితే మేం కూడా బొద్దింకలమే అవుతాం, హక్కుల కోసం తిరగబడతాం” అని స్పష్టం చేశారు.
ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కే సర్వహక్కులా? స్పోర్ట్స్ కోటాలో భారీ అక్రమాలు!
డీఎస్సీ అక్రమాల వెనుక ఉన్న వ్యూహాన్ని జగన్ వివరంగా ఎండగట్టారు. సాధారణంగా ఉండే డీఎస్సీ కన్వీనర్ను పక్కనపెట్టి.. ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ బాధ్యతలను కేవలం ఎస్సీఈఆర్టీ (SCERT) డైరెక్టర్కు మాత్రమే అప్పగించారని, ఒకే అధికారి చేతిలో అధికారాలు కేంద్రీకృతం కావడం వల్లే పారదర్శకత లోపించిందని ఆరోపించారు.
ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద జరిగిన నియామకాల్లో పెద్ద ఎత్తున దగా జరిగిందని జగన్ ధ్వజమెత్తారు.
స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు అర్హత పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండా, కేవలం ‘పార్టిసిపేషన్ సర్టిఫికేట్’ ఉంటే చాలనే జీవో తెచ్చారు. టీడీపీ నేతలు ఇచ్చిన నకిలీ జిల్లా, కాలేజీ స్థాయి సర్టిఫికేట్లతో సుమారు 270 మంది అర్హత పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు పొందారు. మరోవైపు, జాతీయ స్థాయి క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన నిజమైన క్రీడాకారులకు ఇంటర్వ్యూలు చేసినా ఉద్యోగాలు రాలేదు.
చంద్రబాబు, లోకేశ్ ముద్దాయిలు.. సీబీఐ విచారణే శరణ్యం!
తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగు నెలల్లోనే 1.30 లక్షల సచివాలయ ఉద్యోగాలను ఎలాంటి లీకులు, లోపాలు లేకుండా అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని జగన్ గుర్తు చేశారు. ప్రస్తుత డీఎస్సీ వ్యవహారంలో సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఇద్దరూ ముద్దాయిలని.. కాబట్టి వారి పరిధిలోని విచారణ సంస్థలు న్యాయం చేయలేవని, అందుకే సీబీఐ విచారణ అవసరమని స్పష్టం చేశారు. జూన్ 12న వైఎస్సార్సీపీ చేపట్టనున్న ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమంలో ఈ డీఎస్సీ కుంభకోణంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

