MoU : ఆంధ్రప్రదేశ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMSMEDC) తో ప్రముఖ టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా ఎంటర్ప్రైజ్ విభాగమైన 'Vi బిజినెస్' ఒక కీలక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
ఈ భాగస్వామ్యం ద్వారా 'రెడీ ఫర్ నెక్స్ట్' (ReadyForNext) ప్రోగ్రామ్ కింద రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (MSMEలు) డిజిటల్గా శక్తివంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా మహిళా నేతృత్వంలోని సంస్థలు, గ్రామీణ వ్యాపారాలు, స్టార్టప్లు మరియు తయారీ రంగానికి చెందిన MSMEలలో డిజిటల్ పరివర్తనను వేగవంతం చేసేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. క్లౌడ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ (IoT), ఎంటర్ప్రైజ్ మొబిలిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిష్కారాలపై వర్క్షాప్లు, డిజిటల్ అసెస్మెంట్ వేదికల ద్వారా అవగాహన కల్పించి వ్యాపార సామర్థ్యాన్ని పెంపొందించనున్నారు.

ఆర్థిక ప్రగతిలో ఏపీ మార్క్: డిజిటల్ మెచ్యూరిటీలో టాప్ 10కి ఆంధ్రప్రదేశ్!
దేశ జీడీపీలో దాదాపు 31 శాతం వాటా కలిగి ఉన్న MSMEలు ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం భారత్లో 7.47 కోట్లకు పైగా MSMEలు ఉండగా, అందులో ఏపీ ఏకంగా 42.1 లక్షలకు పైగా సంస్థలతో ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతోంది. 'Vi బిజినెస్ రెడీ ఫర్ నెక్స్ట్ MSME గ్రోత్ ఇన్సైట్స్ స్టడీ 2026' నివేదిక ప్రకారం, డిజిటల్ మెచ్యూరిటీ ఇండెక్స్ (DMI) లో 61.1 స్కోరుతో ఏపీ తొలిసారిగా దేశంలోనే టాప్ 10 రాష్ట్రాల జాబితాలోకి ప్రవేశించడం విశేషం. ఇండియా ఎస్ఎంఈ ఫోరమ్తో పాటు జిల్లా పరిశ్రమల కేంద్రాల (DICs) సహకారంతో క్షేత్రస్థాయిలో వర్క్షాప్లు, వెబినార్లను నిర్వహించి చిన్న తరహా పరిశ్రమలను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే ఈ అవగాహన ఒప్పందం ముఖ్య ఉద్దేశమని Vi చీఫ్ ఎంటర్ప్రైజ్ బిజినెస్ ఆఫీసర్ ఎం.పి.సునీల్ కుమార్ పేర్కొన్నారు.

