SPH : భారతీయ పబ్లిషింగ్ మరియు మీడియా రంగంలో ఒక సరికొత్త సంచలనానికి తెరలేచింది. దేశీయ పబ్లిషింగ్ సంస్థ 'ఆశ్రయు మీడియా ప్రైవేట్ లిమిటెడ్', సింగపూర్కు చెందిన ప్రముఖ ఓమ్నిఛానల్ మీడియా నెట్వర్క్ 'ఎస్పీహెచ్ (SPH) మీడియా'తో చారిత్రాత్మక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.
ఈ టై-అప్ ద్వారా అంతర్జాతీయంగా ఎంతగానో గుర్తింపు పొందిన ఐకానిక్ పత్రికలు 'ఎఫ్ జైన్' (Female / Fmagazine - FashioN & Lifestyle), 'ది పీక్' (The Peak) లగ్జరీ మరియు బిజినెస్-లైఫ్స్టైల్ మ్యాగజైన్లను తొలిసారిగా భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు లగ్జరీ విభాగంలో పాశ్చాత్య (వెస్ట్రన్) పోకడల వైపే మొగ్గుచూపిన భారతీయ పాఠకులకు, సంస్కృతి మరియు ఆధునిక జీవనశైలిలో ఎంతో సుసంపన్నమైన ఆగ్నేయాసియా (సౌత్ ఈస్ట్ ఆసియా) దృక్కోణాన్ని పరిచయం చేయడంలో ఈ భాగస్వామ్యం అత్యంత కీలక పాత్ర పోషించనుంది.
ఈ చారిత్రాత్మక ఒప్పందం ద్వారా కేవలం ప్రింట్ పత్రికలను ముద్రించడమే కాకుండా.. డిజిటల్ మీడియా విస్తృతిని, ఎక్స్పీరియన్షియల్ ప్లాట్ఫారమ్లను ఏకం చేసే బహుళ-వేదికల (Multi-platform) వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు ఆశ్రయు మీడియా చైర్మన్ సుధాకర్ అడపా స్పష్టం చేశారు. ఐదు దశాబ్దాలుగా ఫ్యాషన్, యువత సంస్కృతి మరియు సృజనాత్మక రంగాలలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన 'ఎఫ్ జైన్'కు సింగపూర్ వెలుపల లభిస్తున్న మొట్టమొదటి అంతర్జాతీయ ఫ్రాంచైజీ మార్కెట్ భారతదేశమే కావడం విశేషం. మరోవైపు, 1984 నుండి సీ-సూట్ అధికారులు, అగ్రశ్రేణి వ్యాపారవేత్తలకు అత్యంత నమ్మకమైన వ్యాపార-జీవనశైలి మార్గదర్శిగా ఉన్న 'ది పీక్' పత్రిక కూడా భారతీయ దార్శనికుల నడుమ బలమైన కమ్యూనిటీలను సృష్టించడానికి సిద్ధమైంది. ఈ రెండు అంతర్జాతీయ బ్రాండ్ల ప్రవేశంతో భారతీయ మీడియా రంగంలో ఉన్న ఒక పెద్ద వెలితి పూడటమే కాకుండా, దక్షిణాసియా దేశాల మధ్య సాంస్కృతిక మరియు సౌందర్య సంభరిత వారధి మరింత బలోపేతం కానుంది.

