Phone Tapping Case: తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్టేట్మెంట్ను రికార్డు చేసింది.
2023వ సంవత్సరంలో ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించిన కాల్ డేటా రికార్డులను (CDR) ఈ కేసులోని నిందితులు అక్రమంగా సేకరించినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆయనను సాక్షిగా పరిగణిస్తూ పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయడం విశేషం. పక్క రాష్ట్రానికి చెందిన ఒక ఉన్నతాధికారిని ఈ కేసు విచారణ పరిధిలోకి తీసుకురావడం ఇదే మొదటిసారి.

ముగింపు దశకు దర్యాప్తు.. తుది ఛార్జ్షీట్కు కసరత్తు
గత ఐదున్నర నెలలుగా రేయింబగళ్లు సాగుతున్న ఈ విచారణలో సిట్ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. ఎస్ఐబీ (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఈ కుట్రలో భాగస్వాములైన పలువురు మాజీ పోలీసు అధికారులు, రాజకీయ నాయకులపై పక్కా సాక్ష్యాలతో కూడిన తుది ఛార్జ్షీట్ను న్యాయస్థానంలో దాఖలు చేసేందుకు సిట్ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.
బీఆర్ఎస్ ముగ్గురు నేతలపై ఫోకస్.. సిద్ధమవుతున్న అనుబంధ ఛార్జ్షీట్!
ఈ కేసు దర్యాప్తు ముగింపు దశకు చేరుకున్న తరుణంలో నిందితుల జాబితా మరింత విస్తరిస్తోంది.
గతంలో ఈ కేసు దర్యాప్తు క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతల పేర్లను కూడా నిందితుల జాబితాలో చేర్చినట్లు జోరుగా ప్రచారం సాగింది. దానికి బలాన్ని చేకూరుస్తూ సిట్ అధికారులు ఇప్పుడు బలమైన సాక్ష్యాధారాలతో కూడిన అనుబంధ అభియోగ పత్రాన్ని (Supplementary Charge Sheet) సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఏబీ వెంకటేశ్వరరావు ఇచ్చిన సాక్ష్యం ఈ కేసులో కీలక ఆధారంగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

