Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ అంశం కాదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేవలం రాజకీయ అంశం కాదు: యెన్నం శ్రీనివాస్ రెడ్డి

వార్త 1 week ago
  • ఇది రాజ్యాంగబద్ధమైన హక్కులకు సంబంధించిన విషయం
  • వ్యక్తిగత స్వేచ్ఛలో జోక్యం అక్రమం
  • పోటీ ఎన్నికల్లో జరగాలి.. గూఢచర్య మార్గాల్లో కాదు..
  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Phone Tapping Case:ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తన వ్యక్తిగత అంశం కాదని, రాజకీయ అంశం అసలే కాదని, ఇది తెలంగాణ ప్రజల రాజ్యాంగబద్ధమైన హక్కులకు సంబంధించిన అత్యంత కీలకమైన విషయం అని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నం. 12లో ఉన్న కమీషనర్ ఆఫ్ పోలీస్, ఐసీసీసీ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) అధికారుల ఎదుట ఆయన హాజరై తన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న తన మొబైల్ ఫోన్ అనుమానాస్పదంగా ట్యాపింగ్‌కు గురైందని, దీనిపై తొలిసారిగా తాను డిఐజీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Read also: Aadhaar Update: కొత్త ఆధార్ యాప్.. మీ డిజిటల్ గుర్తింపు ఇక మరింత సురక్షితం

 Phone tapping issue concerns.

వ్యక్తిగత స్వేచ్ఛపై నిఘా అక్రమం

అనంతరం చాలామంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా తమ ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాముఖ్యతతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం సంభాషణలను వినడమే కాకుండా, ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత స్వేచ్ఛలో అక్రమ జోక్యం చేసుకోవడమేనని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి గోప్యత హక్కు కల్పించబడిందని, సుప్రీంకోర్టు పుట్టస్వామి తీర్పు ద్వారా గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛకు హామీ ఉందని, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే భయం ఉంటే ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడలేరని అన్నారు. "భయం ఉన్న చోట స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛ లేని చోట ప్రజాస్వామ్యం ఉండదు" అని ఆయన పేర్కొన్నారు.

Phone Tapping Case:గూఢచర్య మార్గాలకు స్వస్తి పలకాలి

 Phone tapping issue concerns.

రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం ప్రజాస్వామ్యంపై దాడితో సమానమని, రాజకీయ పోటీ ప్రజల మధ్య ఎన్నికల్లో జరగాలని, గూఢచర్య మార్గాల్లో కాదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిఘా ద్వారా రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలపై పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే సంబంధించినది కాదని, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు, న్యాయవాదులు, విద్యార్థులు సహా ప్రతి మొబైల్ వినియోగదారుడి హక్కులకు సంబంధించిన అంశమని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం జరిగిందని, నిఘా రాజ్యం కోసం కాదని స్పష్టం చేశారు. ఈ కేసులో పూర్తి నిజాలు వెలుగులోకి రావాలని, ఎవరు ఆదేశించారు, ఎవరు అమలు చేశారు, ఎంతమంది ప్రభావితులయ్యారు అనే అంశాలపై ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ విచారణ ప్రతీకారం కోసం కాదని, రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతోందని తెలిపారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా, వారు ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నా చట్టం ముందు సమాధానం చెప్పాల్సిందేనని, ప్రజాస్వామ్యంలో ఎవరూ చట్టానికి అతీతులు కారని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha