Chandrababu Naidu: వ్యవసాయ మరియు ఉద్యాన ఉత్పత్తులకు ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా విలువ జోడించి, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఈ ప్రక్రియ ద్వారా ఉత్పత్తుల విలువ పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం కలగడంతో పాటు, రాష్ట్రంలో సంపద సృష్టి జరుగుతుందని ఆయన తెలిపారు. ఏలూరు జిల్లా ముసునూరు వద్ద ఏర్పాటు చేసిన 'గార్మే పాప్ కార్నికా' నాన్-జీఎంఓ హైబ్రీడ్ మొక్కజొన్న విత్తనాలను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్తో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం దేశంలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ యూనిట్ను వారు పరిశీలించారు.

దేశీయ నేలపైనే నాన్-జీఎంఓ విత్తనాల ఉత్పత్తి
రైతులపై ఉన్న మక్కువతో ఉపరాష్ట్రపతి ఏలూరు జిల్లాకు వచ్చి జన్యుమార్పిడి చేయని మొక్కజొన్న విత్తనాలను ఆవిష్కరించడం అభినందనీయమని సీఎం కొనియాడారు. గార్మే పాప్ కార్న్ సంస్థ మన దేశీయ నేలపైనే రైతులతో కలిసి నాన్-జీఎంఓ విత్తనాలను ఉత్పత్తి చేయడం గర్వకారణమన్నారు. సుమారు 17,500 మంది రైతులతో 40 వేల ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తూ, దేశీయ పాప్కార్న్ ఉత్పత్తిలో 70 శాతం వాటాను కలిగి ఉండటం విశేషమని సంస్థను ప్రశంసించారు. ఇప్పటివరకు పాప్కార్న్ కోసం విదేశాలపై ఆధారపడే పరిస్థితి ఉండేదని, ఇకపై ఆ సంపద మన దేశంలోనే ఉంటుందని పేర్కొన్నారు.
Chandrababu Naidu: గ్లోబల్ బ్రాండ్లుగా మన స్థానిక ఉత్పత్తులు
ఆంధ్రా పాప్కార్న్, అరకు కాఫీ, కోస్తా కోకో వంటి ఉత్పత్తులు ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రాండ్లుగా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. రైల్వే స్టేషన్లలోనూ వీటికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొండపల్లి కొయ్యబొమ్మల వంటి స్వదేశీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లకు చేరాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల్లోని ఎన్డీఏ ప్రభుత్వాలు వ్యవసాయాన్ని బలమైన ఆర్థిక శక్తిగా, రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాయని వివరించారు. పసుపు, మిరప, ఆక్వా ఉత్పత్తులకు విలువ జోడించి ఎగుమతి చేయడమే ధ్యేయమన్నారు.
జల భద్రతతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి
రాయలసీమను ఉద్యాన పంటల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. పీపీపీ విధానంలో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులతో సీమను అభివృద్ధి చేస్తామని, రూ. 35 వేల కోట్లతో 36 సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెలాఖరులో వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు నీరందిస్తామన్నారు. నదుల అనుసంధానం ద్వారా దేశవ్యాప్తంగా నీటి సమస్యలను పరిష్కరించవచ్చని, నీటి భద్రత సాధిస్తే దేశాభివృద్ధి అన్స్టాపబుల్ అని ఆయన స్పష్టం చేశారు.

