Harini Murder Mystery : శ్రీకాకుళం జిల్లాలో అత్యంత కలకలం రేపిన దుంపల హరిణి మృతి కేసు చివరకు 'పరువు హత్య' (Honor Killing) గా తేలింది. చదువుకుని గ్రూప్-1 ఆఫీసర్ కావాలనుకున్న ఒక వివాహితను..
ఆమె కన్నతల్లి, భర్త, తాత కలిసి అత్యంత కిరాతకంగా అంతమొందించారు. గుండెపోటుతో చనిపోయిందంటూ నమ్మబలికి, అర్ధరాత్రి వేళ ఎవరికీ తెలియకుండా అంత్యక్రియలు కానిచ్చేసి కథ ముగిసిందనుకున్నారు. కానీ, బాధితురాలు చనిపోకముందే రికార్డ్ చేసిన ఒక సెల్ఫీ వీడియో ఏపీ పోలీసుల 'శక్తి యాప్' (Shakti App) ద్వారా వెలుగులోకి రావడంతో ఈ ఘోరం బయటపడింది. శ్రీకాకుళం జిల్లా బ్రహ్మణతర్లాకు చెందిన హరిణికి 2010లో ఆమె మేనమామ దంతేశ్వరరావుతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లయిన తర్వాత చదువుపై ఆసక్తితో హరిణి డిగ్రీ పూర్తి చేసింది. ఎలాగైనా గ్రూప్-1 సాధించాలనే బలమైన లక్ష్యంతో కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు నాగేంద్ర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో భర్తకు విడాకులు ఇచ్చి నాగేంద్రను వివాహం చేసుకోవాలని హరిణి నిశ్చయించుకుంది.
Read Also: Mancherial: మంచిర్యాల జిల్లాలో విషాదం..గోడ కూలి ఏడేళ్ల బాలిక మృతి
Harini Murder Mystery
Srikakulam Crime : సొంతూరికి పిలిపించి స్కెచ్.. బాధితురాలి ముందస్తు అనుమానం!
హరిణి నిర్ణయాన్ని ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. విడాకుల వ్యవహారం మాట్లాడుకుందాం అని నమ్మించి మే 30న ఆమెను హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం సొర్లిగాం గ్రామానికి తీసుకువెళ్లారు. అయితే, తన కుటుంబం వల్ల ప్రాణాపాయం ఉందని ముందే ఊహించిన హరిణి.. ప్రయాణంలోనే ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి స్నేహితుడు నాగేంద్రకు పంపింది. “మా ఇంట్లో చాలా గొడవలు జరుగుతున్నాయి. జూన్ 5 లోగా నేను హైదరాబాద్ రాకపోయినా, నా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చినా నాకు ఏదో కీడు చేశారని భావించి పోలీసులు చర్యలు తీసుకోవాలి.” - సెల్ఫీ వీడియోలో హరిణి చివరి మాటలు
‘శక్తి యాప్’ ద్వారా దర్యాప్తు.. నిందితుల అరెస్ట్!
హరిణి చెప్పినట్లుగానే జూన్ 5 దాటినా ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆందోళన చెందిన నాగేంద్ర.. జూన్ 6న ఏపీ పోలీసుల మహిళా భద్రతా యాప్ 'శక్తి యాప్' ద్వారా ఫిర్యాదు చేసి, ఆ వీడియోను అప్లోడ్ చేశారు. మంగళగిరి కంట్రోల్ రూమ్ వెంటనే శ్రీకాకుళం పోలీసులను అలర్ట్ చేసింది. పోలీసులు సొర్లిగాం గ్రామానికి వెళ్లి విచారించగా, మే 31 రాత్రే (గ్రామానికి వచ్చిన రోజే) హరిణిని ఇనుప రాడ్డుతో కొట్టి చంపేసినట్లు తేలింది. ఎవరికీ అనుమానం రాకుండా గుండెపోటు అని, ఆ తర్వాత ఆత్మహత్య అని అబద్ధాలు చెప్తూ అర్ధరాత్రి అంత్యక్రియలు పూర్తి చేసేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన హరిణి తల్లి విజయకుమారి, తాత బలుసాకు, భర్త దంతేశ్వరరావులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, హత్యకు వాడిన ఇనుప రాడ్డు, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ డి.లక్ష్మణరావు వెల్లడించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
అప్పుల బాధతో కన్నతల్లినే పొట్టన పెట్టుకున్న కసాయి కొడుకు

