HMWSSB GM ACB Raids: భాగ్యనగరంలో సామాన్యులు నీళ్ల కోసం అల్లాడుతుంటే.. అదే నీటి కష్టాలను ఆసరాగా చేసుకుని ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి ఏకంగా రూ. వంద కోట్ల అక్రమ సామ్రాజ్యాన్ని సృష్టించాడు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ స్వరేజ్ బోర్డు (HMWS&SB) ప్రాజెక్ట్ డివిజన్-VIII లో జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్) గా పనిచేస్తున్న సగ్గం అనంత లక్ష్మి కుమార్ నివాసాలు, కార్యాలయాలపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మంగళవారం ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో బయటపడిన అక్రమాస్తుల చిట్టా చూసి స్వయంగా ఏసీబీ అధికారులే అవాక్కయ్యారు.
Hyderabad Water Tanker Scam
లభ్యమైన కుబేరుడి ఖజానా: కోట్లలో నగదు, కేజీల కొద్దీ బంగారం
లక్ష్మి కుమార్ మల్లాపూర్లోని తన స్వగృహంతో పాటు హైదరాబాద్, నిజామాబాద్లలో ఉన్న అతని బంధువులు, బినామీలకు చెందిన తొమ్మిది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు జరిపింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం వీటి డాక్యుమెంట్ విలువ రూ. 5.88 కోట్లుగా చూపించినప్పటికీ, ఓపెన్ మార్కెట్లో వీటి అసలు విలువ రూ. 50 కోట్ల నుండి రూ. 100 కోట్ల వరకు ఉండవచ్చని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సింధు శర్మ వెల్లడించారు.
మల్లాపూర్ నివాసంలోనే ఏకంగా రూ. 1.1 కోట్ల నగదు (లిక్విడ్ క్యాష్), 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాకుండా నిజామాబాద్లోని నవీపేట, బోధన్లతో పాటు సంగారెడ్డి జిల్లా చేర్యాలలో 18 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు, మహేశ్వరంలో 6 ఓపెన్ ప్లాట్లు, ఉప్పల్లో 3 ఫ్లాట్లు, మల్లాపూర్లో ఒక జీ+3 భవనంతో పాటు లగ్జరీ కార్లు, బైకులను గుర్తించారు. నిందితుడి బ్యాంక్ లాకర్లను తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంది.
ట్యాంకర్ మాఫియా.. రోజుకు రూ. 50,000 అక్రమ సంపాదన!
కేవలం ప్రభుత్వ జీతంతో ఇన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టడం అసాధ్యమని గుర్తించిన ఏసీబీ.. కుమార్ వెనకున్న ట్యాంకర్ మాఫియా గుట్టును రట్టు చేసింది. నగరంలో అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ల నీటి అవసరాలను క్యాష్ చేసుకుంటూ ఇతను బోర్డు రికార్డుల్లోకి ఎక్కించకుండా "అనధికారిక బుకింగ్స్" నడిపినట్లు తేలింది. ఒక్కో ట్యాంకర్కు ఏకంగా రూ. 5,000 వరకు వసూలు చేస్తూ, రోజుకు కనీసం రూ. 50,000 సొంత జేబులోకి వేసుకునేవాడని అధికారులు నిర్ధారించారు.
HMWSSB GM ACB Raids: సోషల్ మీడియాలో నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
"మేం మూడు రోజుల క్రితం లీగల్ గా ట్యాంకర్ బుక్ చేసినా రాలేదు.. మా బుకింగ్స్ ఎందుకు ఎప్పుడూ క్యాన్సిల్ అవుతాయో ఇన్నాళ్లకు అర్థమైంది" అంటూ నగరవాసులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మి కుమార్ను ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా.. "కొన్ని రోజులు సస్పెండ్ అయి, మళ్లీ లంచాలు ఇచ్చి ప్రమోషన్తో వస్తారు.. సిస్టమ్ మారదు" అంటూ నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం ఈ వంద కోట్ల నీళ్ల అవినీతి కేసు నగరవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

