ఏళ్ల తరబడి మధ్యలో ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను తిరిగి పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను(Housing Scheme) నెరవేర్చే లక్ష్యంతో 'స్వామి-2' ( SWAMIH-2 ) నిధిని త్వరలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
ఈ పథకం ద్వారా సుమారు లక్ష మంది గృహ కొనుగోలుదారులకు ఇళ్లు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.

2025-26 కేంద్ర బడ్జెట్లో స్వామి-2 పథకానికి తొలి దశగా రూ.1,500 కోట్ల మూలధనాన్ని కేటాయించారు. మొత్తం రూ.15,000 కోట్ల నిధుల సమీకరణతో నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయనున్నారు. ఈ నిధిని ఎస్బీఐ వెంచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
స్వామి నిధి అంటే ఏమిటి?
బిల్డర్ల ఆర్థిక సమస్యల కారణంగా చివరి దశలో నిలిచిపోయిన అందుబాటు ధరల (Affordable) మరియు మిడ్ ఇన్కమ్ హౌసింగ్ ప్రాజెక్టులను(Housing Scheme) పూర్తి చేయడమే స్వామి నిధి ప్రధాన లక్ష్యం. స్వామి-1 ద్వారా ఇప్పటివరకు సుమారు 55 వేల ఇళ్ల నిర్మాణం పూర్తవగా, వేలాది కుటుంబాలకు ఊరట లభించింది. రాబోయే సంవత్సరాల్లో మరో 30 వేల ఇళ్లను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.
లోన్లకు ఈఎంఐలు చెల్లిస్తూ, ఇళ్లు అందక అద్దె ఇళ్లలో నివసిస్తున్న లక్షలాది మధ్యతరగతి కుటుంబాలకు స్వామి-2 ఒక పెద్ద ఊరటగా మారనుంది. కేవలం నిధుల కొరతతో నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఈ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందుతుంది. ప్రాజెక్టుపై వివాదాలు ఉన్నా, బిల్డర్ గత రికార్డు బలహీనంగా ఉన్నా, ఆ ప్రాజెక్టు వాణిజ్యపరంగా సాధ్యసాధ్యాలుంటే 'లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్'గా స్వామి నిధి మద్దతు ఇస్తుంది.
రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి
రెరా (RERA)లో నమోదు అయిన ప్రాజెక్టులు మాత్రమే ఈ నిధికి అర్హత పొందుతాయి. 2019 నాటి అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా సుమారు 1,500 ప్రాజెక్టుల్లో 4.58 లక్షల ఇళ్లు మధ్యలో నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేయడానికి దాదాపు రూ.55 వేల కోట్ల నిధులు అవసరమని అంచనా. ప్రస్తుత స్వామి-2 నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్థబ్ధత తొలగి, గృహ కొనుగోలుదారుల్లో నమ్మకం పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

