Bhuvanagiri School Incident: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందడి నడుమ ఓ పాఠశాలలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 15 వేడుకల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థుల మధ్య అకస్మాత్తుగా ప్రమాదం సంభవించింది.
క్షణాల వ్యవధిలో ఆనంద వాతావరణం విషాదంగా మారగా, ఈ ఘోర ప్రమాదంలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మరో పలువురు విద్యార్థులు గాయపడటంతో వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు
Read Also : Ponguleti Vs KTR : కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్
Accident during Independence Day games… Third-grade child dies.
Bhuvanagiri School Incident: భువనగిరి బాగాయత్ స్కూల్లో ప్రమాదం.. మూడో తరగతి చిన్నారి మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బాగాయత్ ప్రభుత్వ పాఠశాల ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్నారులంతా మైదానంలో కేరింతలు కొడుతూ ఆటల్లో మునిగిపోయారు. అంతలోనే, పాఠశాల ప్రాంగణంలో ఉన్న భారీ వేపచెట్టు పెద్ద కొమ్మ ఒక్కసారిగా విరిగి చిన్నారులపై పడింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే పలువురు విద్యార్థులు ఆ కొమ్మ కింద చిక్కుకుపోయారు.
ఈ ప్రమాదంలో మూడో తరగతి చదువుతున్న హాలీమా అనే చిన్నారి తీవ్రంగా గాయపడింది. బాలిక పరిస్థితి విషమించడంతో వెంటనే మెరుగైన చికిత్స కోసం బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే ఆ చిన్నారి ప్రాణాలు విడిచింది.
అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికుల ఆగ్రహం
ఈ ఘటనపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వేపచెట్టు లోపలి భాగంలో ఆరు నెలల క్రితం మంటలు చెలరేగాయని, ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పినప్పటికీ చెట్టు అంతర్భాగం కాలిపోవడంతో అది బలహీనపడిందని అప్పుడే హెచ్చరించారని స్థానికులు తెలిపారు. అంత ప్రమాదకరంగా మారిన చెట్టును తొలగించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ రోజు అమాయక చిన్నారి హాలీమా ప్రాణాలు కోల్పోయిందని వారు ఆరోపిస్తున్నారు. పిల్లలకు భద్రతగా ఉండాల్సిన పాఠశాలల్లో ఇలాంటి నిర్లక్ష్యం తగదని మండిపడుతున్నారు.

