దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యమయ్యారు. కర్ణాటకలోని కార్వార్ నేవీ బేస్ను సందర్శించిన ఆమె, అక్కడి నుంచి భారత నౌకాదళానికి చెందిన INS వాఘ్షీర్(INS Vagsheer) జలాంతర్గామిలో సముద్రపు లోతుల్లో సాహస ప్రయాణం చేశారు.
ఈ ప్రత్యేక ప్రయాణంలో ఆమెతో పాటు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి కూడా పాల్గొన్నారు. కల్వరి క్లాస్కు చెందిన ఈ సబ్మెరైన్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడటం విశేషం. జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్రలో నిలిచారు.
Read also: Excise Duty: పొగాకు వినియోగం తగ్గించడానికి కేంద్రం కొత్త చర్య

అబ్దుల్ కలాం తరువాత ముర్ముకే ఈ గౌరవం
భారత రాష్ట్రపతుల్లో ఇలాంటి సాహస ప్రయాణానికి ముందు అడుగు వేసిన వారు దివంగత అబ్దుల్ కలాం మాత్రమే. ఆయన జలాంతర్గామిలో ప్రయాణించి నౌకాదళానికి ప్రోత్సాహం అందించారు. ఇప్పుడు అదే పరంపరను ద్రౌపది ముర్ము కొనసాగించారు. ఈ ప్రయాణం ద్వారా భారత నౌకాదళ సామర్థ్యం, స్వదేశీ రక్షణ తయారీపై దేశ ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు.
ఫైటర్ జెట్ల నుంచి సబ్మెరైన్ వరకూ
INS Vagsheer: ఇది ద్రౌపది ముర్ము చేసిన తొలి సాహసం కాదు. ఇటీవలే హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుంచి రఫేల్ యుద్ధ విమానంలో ఆమె గగన విహారం చేశారు. అంతకుముందు 2023 మే 8న అసోంలోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి సుఖోయ్-30 MKI ఫైటర్ జెట్లో ప్రయాణించారు. ఈ ఘనత సాధించిన రెండో మహిళా రాష్ట్రపతిగా ఆమె గుర్తింపు పొందారు. 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఇదే విమానంలో ప్రయాణించగా, 2006లో అబ్దుల్ కలాం కూడా సుఖోయ్లో గగనయానం చేశారు. ఫైటర్ జెట్లో గగనతలంలో సాహసయాత్ర చేసిన తర్వాత, ఇప్పుడు సముద్రపు లోతుల్లో సబ్మెరైన్ ప్రయాణం చేయడం ద్వారా ద్రౌపది ముర్ము మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

