Dailyhunt
International Airport: భోగాపురం విమానాశ్రయంలో నేడు తొలి ట్రయల్ రన్..

International Airport: భోగాపురం విమానాశ్రయంలో నేడు తొలి ట్రయల్ రన్..

వార్త 3 months ago

త్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కల నేడు సాకారం కాబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో(International Airport) ఆదివారం ఉదయం 10.15 గంటలకు తొలి వాణిజ్య విమానంతో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.

జీఎంఆర్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ చారిత్రక సందర్భంలో ఎయిర్ ఇండియా విమానం రన్‌వే మీద ల్యాండ్ కానుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సహా పలువురు ఉన్నతాధికారులు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో భోగాపురం చేరుకోనున్నారు.

96 శాతం పూర్తైన నిర్మాణ పనులు

అధికారుల సమాచారం ప్రకారం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport) నిర్మాణ పనులు ఇప్పటికే 96 శాతం పూర్తి అయ్యాయి. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే కీలక ఆర్థిక కేంద్రంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి స్థాయి విమాన సేవలు ఈ ఏడాది జులై నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ విమానాశ్రయాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. గతంలో హుద్‌హుద్ వంటి తీవ్ర తుఫాన్లను తట్టుకునేలా డిజైన్ చేశారు. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ప్రభావం పడని విధంగా నిర్మాణం చేపట్టారు. అలాగే 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనా నీరు నిలవకుండా బయటకు వెళ్లేలా అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

ఖర్చు, సామర్థ్యం, వాణిజ్య అవకాశాలు

తొలి దశలో ఈ ప్రాజెక్టు కోసం రూ.4,725 కోట్లను వెచ్చించారు. ఈ విమానాశ్రయం రోజుకు సుమారు 200 విమానాల రాకపోకలను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏడాదికి దాదాపు 20 వేల టన్నుల సరుకు ఎగుమతులకు అవకాశం కల్పిస్తుంది. రాత్రి వేళలో 18 విమానాలను ఒకేసారి పార్కింగ్ చేసుకునే సదుపాయాలు కూడా ఉన్నాయి.

ప్రయాణికుల అంచనాలు & మౌలిక సదుపాయాలు

ఇక్కడి నుంచి ప్రయాణించే వారిలో 33 శాతం మంది విశాఖ నగరవాసులు కాగా, మిగిలిన 67 శాతం మంది ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాలకు చెందినవారై ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల కోసం 14 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి విమానాశ్రయానికి చేరుకునేందుకు మూడు ప్రధాన రహదారులను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

విమానాశ్రయ టెర్మినల్ లోపల విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం, ఏటికొప్పాక కళాకృతులు ఏర్పాటు చేయనున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిఫలించేలా అంతర్గత అలంకరణలు చేయనున్నారు.

భారీ విమానాలకు అనుకూల రన్‌వేలు

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అంతర్జాతీయ బిడ్స్ ద్వారా ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ఒకేసారి 300 విమానాలు దిగేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించడం విశేషం. ఎయిర్‌బస్ A380, బోయింగ్ 747-8 వంటి ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలు సైతం సులభంగా ల్యాండ్ అయ్యేలా రన్‌వేలను రూపొందించారు. తొలి దశలోనే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యంతో టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha