Trump - Iran : పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణాన్ని ముగించేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జెనీవాలో కుదిరిన అవగాహన ఒప్పందం (MoU) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో బాంబ్ పేల్చారు.
ఫ్రాన్స్లో జరుగుతున్న జీ-7 (G7) సదస్సు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జెనీవాలో సంతకాలు చేయబోయేది కేవలం ఒక అవగాహన ఒప్పందం మాత్రమేనని, అది తుది ఒప్పందం కాదని స్పష్టం చేశారు. ఒకవేళ భవిష్యత్తులో ఇరాన్తో జరిగే పూర్తిస్థాయి చర్చలు మరియు తుది నిర్ణయాలు తనకు నచ్చకపోతే, లేదా ఇరాన్ పద్ధతి మార్చుకోకుండా ప్రవర్తిస్తే ఏమాత్రం వెనకాడకుండా ఆ దేశంపై మళ్లీ కాల్పులు జరుపుతామని, వారి తలలపై బాంబులు వేస్తామని అత్యంత ఘాటుగా హెచ్చరించారు. ఇరాన్ గత 47 ఏళ్లుగా తప్పుగా ప్రవర్తిస్తోందని, కాబట్టి తమ సైనిక చర్యల ముప్పు ఎప్పటికీ పొంచే ఉంటుందని ట్రంప్ తేల్చిచెప్పారు.
Read Also : అమెరికాలో భారతీయ టెక్కీకి నరకం.. గ్రీన్ కార్డ్ పేరుతో ₹94 లక్షలు నొల్లేసిన దేశీ సీఈఓ!

ఇరాన్కు ఆర్థిక సాయం నిరాకరణ.. అమెరికా దూకుడు
మరోవైపు ఈ శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్కు ఎలాంటి భారీ ఆర్థిక ప్రయోజనాలు చేకూరవని అమెరికా స్పష్టం చేస్తోంది. ఇరాన్కు తాము ఒక్క డాలర్ కూడా ఇవ్వబోమని యూఎస్ (US) ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ఒప్పందం యొక్క ప్రాథమిక లక్ష్యం ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా అడ్డుకోవడం మరియు అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) జలమార్గాన్ని వాణిజ్య రవాణా కోసం పూర్తిగా పునరుద్ధరించడమేనని అమెరికా అగ్రనాయకత్వం పేర్కొంది. కేవలం 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ కాలంలో మాత్రమే ఇరాన్ చమురు ఎగుమతులపై కొన్ని ఆంక్షల సడలింపు ఉంటుందని, అంతకుమించి ఇరాన్కు నిధులు సమకూర్చే ప్రసక్తే లేదని అమెరికా వైఖరిని బట్టి అర్థమవుతోంది. దీంతో ఈ ప్రతిపాదిత జెనీవా శాంతి ఒప్పందంపై ఇరుదేశాల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

