Jammu & Kashmir: దేశ రక్షణ బాధ్యతలు చూసే సైన్యానికి, స్థానిక శాంతిభద్రతలను కాపాడే పోలీసులకు మధ్య జమ్మూకశ్మీర్లో ఊహించని రీతిలో ఘర్షణ చోటుచేసుకుంది.
కిష్టవార్ జిల్లాలోని అథోలి పోలీస్ స్టేషన్పై ఆర్మీ జవాన్లు కర్రలు, ఐరన్ రాడ్లతో దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఒక కమాండింగ్ ఆఫీసర్, మేజర్ సహా ఏకంగా 40 మంది సైనిక సిబ్బందిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేయడం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారింది.

వాహనం సీజ్ చేయడమే వివాదానికి కారణం: డీఎస్పీ సహా పలువురు పోలీసులకు గాయాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 17 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్. అరుణ్ గాంధీ, మేజర్ వికాశ్ శర్మ, నయిబ్ సుబేదార్ శంకర్ గుర్కేలతో పాటు మరో 40 మంది జవాన్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, పోలీస్ స్టేషన్లోకి అక్రమంగా చొరబడి సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేయడం వంటి ఆరోపణలపై హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నిరోధక చట్టాల కింద కఠిన సెక్షన్లను నమోదు చేశారు.
రవాణా శాఖ నియమ నిబంధనల ప్రకారం కిష్టవార్ అసిస్టెంట్ రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఒక ఆర్మీ వాహనాన్ని సీజ్ చేయడమే ఈ వివాదానికి మూలకారణంగా తెలిసింది. ఈ విషయమై లోకల్ పోలీసులకు, ఆర్మీ అధికారులకు మధ్య మొదట వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆర్మీ సిబ్బంది ఒక ప్రణాళిక ప్రకారం లాఠీలు, ఇనుప రాడ్లు, సర్వీస్ ఆయుధాలతో స్టేషన్కు వచ్చి దాడికి తెగబడ్డారని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ దాడిలో డీఎస్పీ విజయ్ కుమార్ భగత్, ఎస్హెచ్ఓ అమృత్ కాటోచ్ సహా పలువురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మేజర్ వికాశ్ శర్మ అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ ఎస్డీపీఓ (SDPO) పైనే భౌతికంగా దాడికి దిగారని డీఎస్పీ విజయ్ కుమార్ ఆరోపించారు.
Jammu & Kashmir: స్పందించిన రక్షణ శాఖ.. సంయుక్త దర్యాప్తునకు ఆదేశం
ఈ ఉదంతం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీయడంతో రక్షణ శాఖ అధికారికంగా స్పందించింది. ఈ ఘటనపై జరుగుతున్న విచారణకు ఆర్మీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. పోలీస్, మిలిటరీ సంయుక్తంగా చేపట్టే విచారణ ముగిసిన తర్వాత, ఇందులో తప్పు చేసినట్లు తేలితే ఆర్మీ చట్టాల ప్రకారం సంబంధిత సిబ్బందిపై అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
రాజకీయ లబ్ధి కోసమే మతపరమైన ఆదేశాలను జారీ చేస్తున్నారు.. భగవంత్ మాన్

