KCR : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (KCR) గత కొంతకాలంగా ప్రజల్లోకి రాకపోవడం, రాజకీయంగా మౌనం వహించడంపై వస్తున్న విమర్శలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదంటూ ప్రత్యర్థులు వేస్తున్న ప్రశ్నలపై ఆయన ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ ఆసక్తికరమైన పోలికను ఉదాహరించారు. “గోడకు వేలాడదీసిన తుపాకీ ఎప్పుడూ సైలెంట్గానే కనిపిస్తుంది.. కానీ అది ఒక్కసారి పేలితే మాత్రం విస్ఫోటనం (భారీ పేలుడు) సృష్టిస్తుంది” అంటూ కేసీఆర్ ప్రస్తుత మౌనం వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం దాగి ఉందనే సంకేతాన్ని పంపారు. కేసీఆర్ కేవలం ఒక వ్యక్తి కాదని, తెలంగాణలో ఎంతో మంది బలమైన నాయకులను తయారు చేసిన ఒక అజేయ శక్తి అని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.

ఆయన దర్శకత్వంలోనే పని చేస్తున్నాం.. కేసీఆర్ మాటలే మా మాటలు
తాము ప్రస్తుతం కేసీఆర్ నిర్దేశించిన మార్గంలోనే నడుస్తున్నామని, అసెంబ్లీలో గానీ, ప్రజా క్షేత్రంలో గానీ తాము మాట్లాడే ప్రతి మాట కేసీఆర్ ఆలోచనల నుండే వస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. “మేమంతా కేసీఆర్ గారి దర్శకత్వంలోనే పనిచేస్తున్నాం. నిజమైన నాయకుడు అనేవాడు ఎల్లప్పుడూ ముందుండి నడిపించాలి, ఆ బాధ్యతను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు” అని కేటీఆర్ పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా ఎప్పుడు ఎలా స్పందించాలో కేసీఆర్కు బాగా తెలుసని, సరైన సమయం వచ్చినప్పుడు ఆయన నేరుగా రంగంలోకి దిగి ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొడతారని వివరించారు. కేసీఆర్ బయటకు రాకపోయినప్పటికీ, ఆయన ఆలోచనలు, పార్టీ శ్రేణులకు ఆయన ఇచ్చే దిశా నిర్దేశం నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.

