CJP NEET Protest: నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై చేపట్టిన ఉద్యమాన్ని తాత్కాలికంగా విరమించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) మరోసారి కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్లను (FIRs) ఉపసంహరిస్తామని ఇచ్చిన హామీ అమలు కాకపోతే, దేశవ్యాప్తంగా మళ్లీ ఉద్యమాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను సాకుగా చూపుతూ ప్రభుత్వం హామీల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని ఆరోపించింది.
ఈ అంశంపై మాట్లాడిన సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, ఉద్యమం సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. నిరసనకారులపై కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయబోమని, ఇప్పటికే నమోదైన కేసులను ఉపసంహరిస్తామని ప్రభుత్వం బహిరంగంగా చెప్పిందని పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు కేసు కోర్టు పరిధిలో ఉందనే నెపంతో హామీ అమలును వాయిదా వేస్తోందని ఆయన విమర్శించారు.
CJP warns the Center.. We will protest again if the cases are not withdrawn.
CJP NEET Protest: సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపిస్తున్నారు
సుప్రీంకోర్టు శాంతియుత నిరసనకారులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసిందని, నేరచరిత్ర లేని నిర్బంధితులను విడుదల చేయాలని ఆదేశించిందని సౌరవ్ దాస్ తెలిపారు. అయితే, నమోదైన ఎఫ్ఐఆర్లపై దర్యాప్తు కొనసాగించవచ్చని కోర్టు పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంటోందని ఆరోపించారు. ఎఫ్ఐఆర్లను ఉపసంహరించకూడదని కోర్టు ఎక్కడా చెప్పలేదని, కేసులను రద్దు చేసే అధికారం పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనే ఉందనే విషయాన్ని గుర్తుచేశారు.
ఇచ్చిన మాట తప్పితే వీధుల్లోకి వస్తాం!
మంగళవారంలోగా ఈ అంశంపై కేంద్రం నుంచి లిఖితపూర్వక హామీ వస్తుందని భావించినా, ఎలాంటి సమాచారం అందలేదని సీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర్ప్రదేశ్, గోవా, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో నిరసన తెలిపిన యువతపై వేధింపులు కొనసాగుతున్నాయని, ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ యువతపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని, తక్షణమే కేసులన్నింటినీ ఎత్తివేయకపోతే విద్యార్థుల తరఫున మళ్లీ వీధుల్లోకి వచ్చి పోరాడతామని హెచ్చరించారు.

