Saurav Das : కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కో-కన్వీనర్ సౌరవ్ దాస్, కేంద్ర ప్రభుత్వం మరియు పుదుచ్చేరి పోలీసులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.
విచారణ పేరుతో పుదుచ్చేరి పోలీసులు తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయంగా తన నోరు మూయించేందుకే కేంద్రం కుట్ర పన్నుతోందని ఆయన మండిపడ్డారు. తన నివాసానికి వచ్చిన పోలీసులు అనేక రకాల ప్రశ్నలతో కుటుంబ సభ్యులను వేధించారని సౌరవ్ దాస్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు."పుదుచ్చేరిలోని బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం నా కుటుంబాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? ఈ విచారణకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు?" అని ఆయన ప్రశ్నించారు.పోలీసులు గూండాల మాదిరిగా వ్యవహరించకుండా, చట్టానికి కట్టుబడి పనిచేసేలా వ్యవస్థను నిర్మించాలన్న తమ పోరాటం ఈ వేధింపులతో మరింత బలపడుతుందని స్పష్టం చేశారు.
Read Also: Indian Family Killed In US : తల్లి, తమ్ముడిని హత్య చేసిన 17 ఏళ్ల భారత సంతతి బాలుడు
Saurav Das : అమిత్ షా పర్యటనతో ముడిపెడుతూ విమర్శలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల పుదుచ్చేరిలో పర్యటించిన విషయాన్ని సౌరవ్ దాస్ ప్రస్తావించారు.పుదుచ్చేరి పర్యటనలో అమిత్ షా లెఫ్టినెంట్ గవర్నర్తో పాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారని తెలిపారు.ఆ సమావేశంలోనే తన కుటుంబాన్ని బెదిరించేందుకు ప్రణాళిక వేశారా? అని సౌరవ్ దాస్ సంచలన ప్రశ్నలు గుప్పించారు. ఇలాంటి బెదిరింపు చర్యలకు తాను భయపడేది లేదని తేల్చి చెప్పారు. సౌరవ్ దాస్ ఆరోపణలను పుదుచ్చేరి పోలీసు అధికారులు తీవ్రంగా ఖండించారు. రాబోయే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పుదుచ్చేరి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామని పోలీసులు వివరణ ఇచ్చారు.వీఐపీలు సందర్శించే సున్నితమైన ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, హోటళ్లలో కొత్తగా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు వచ్చి నివాసం ఉంటున్నారా అనే కోణంలో సాధారణ విచారణలు మాత్రమే నిర్వహిస్తున్నామని తెలిపారు.దీని వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని, ప్రతి ఏడాది నిర్వహించే రూటీన్ భద్రతా తనిఖీల్లో భాగమేనని స్పష్టం చేశారు.

