Donald Trump: అమెరికా, ఇజ్రాయెల్ దళాలు జరిపిన సైనిక దాడిలో కన్నుమూసిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనల సందర్భంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ తీవ్ర ఉద్రిక్తతలకు వేదికైంది.
టెహ్రాన్లోని ప్రసిద్ధ గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇరాన్ రాజకీయ, సైనిక రంగానికి చెందిన అగ్రనాయకత్వం సుదీర్ఘ కాలం తర్వాత భారీ సంఖ్యలో హాజరైంది. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ వాతావరణం కారణంగా దాదాపు నాలుగు నెలల పాటు ఆలస్యమైన ఈ అంత్యక్రియల శవయాత్రను, ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు వారం రోజుల పాటు అధికారికంగా నిర్వహిస్తోంది.

ప్రతీకార వేదికగా మారిన ప్రార్థనలు:
ఖమేనీ అంత్యక్రియల ప్రార్థనలు పూర్తిగా రాజకీయ, ప్రతీకార వేదికగా మారాయి. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది ఇరాన్ పౌరులు జాతీయ జెండాలతో పాటు, ప్రతీకారానికి చిహ్నంగా భావించే ఎరుపు రంగు జెండాలను చేతబూని మొసల్లాకు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహులను లక్ష్యంగా చేసుకుని రాసిన హెచ్చరిక పోస్టర్లు, గ్రాఫిటీలు అక్కడ పెద్ద ఎత్తున దర్శనమిచ్చాయి. ఈ సందర్భంగా ఇరాన్ కవి మహ్మద్ రసూలీ మాట్లాడుతూ.. ట్రంప్ను హతమార్చడమే తమ తదుపరి బాధ్యత అని బహిరంగంగా పిలుపునిచ్చారు. ప్రార్థనల్లో పాల్గొన్న పౌరులు సైతం ఇదే విధమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై అర్మేనియాలో ఇరాన్ రాయబారి ఖలీల్ షిర్ఘోలామి స్పందిస్తూ.. “వ్యక్తులను చంపగలరు కానీ వారి ఆదర్శాలను కాదు; ఖమేనీని చంపి మీరు సువాసనల సీసాను పగలగొట్టారు, ఆ పరిమళం ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది” అంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.
Donald Trump: అగ్రనేతల హాజరు.. కొత్త సుప్రీం లీడర్ అజ్ఞాతం:
ఇజ్రాయెల్ నుంచి డ్రోన్ లేదా క్షిపణి దాడుల ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఇరాన్ ప్రముఖులంతా ఈ వేడుకకు వచ్చి తమ ఐక్యతను చాటారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాగెర్ ఖలీబాఫ్, కుద్స్ ఫోర్స్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ, రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ జనరల్ అహ్మద్ వాహిదీలతో పాటు ఖమేనీ కుమారులు మసౌద్, మేసమ్, ముస్తఫాలు ఇక్కడ కనిపించారు. అయితే, గతంలో జరిగిన దాడిలో గాయపడి, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మాత్రం ఈ కార్యక్రమానికి రాలేదు. గతంలో బహిరంగ సభల ఆధారంగా ఇజ్రాయెల్ లోకేషన్లను గుర్తించి దాడులు చేసిన చరిత్ర ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా ఆయన దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మషాద్లో అంతిమ సంస్కారాలు:
ప్రముఖ షియా మతగురువు, 97 ఏళ్ల అయాతొల్లా జాఫర్ శోభాని ఈ అంత్యక్రియల ప్రార్థనలను పర్యవేక్షించారు. అలీ ఖమేనీతో పాటు దాడిలో మరణించిన ఆయన కోడలు జహ్రా హద్దాద్ అడెల్, 14 నెలల మనవరాలు జహ్రా మొహమ్మది శవపేటికలను కూడా అక్కడ ఉంచారు. ఖమేనీ పార్థివ దేహాన్ని ఇరాన్, ఇరాక్లోని ప్రముఖ నగరాల్లో ఊరేగించిన అనంతరం, గురువారం నాడు ఆయన జన్మస్థలమైన మషాద్లోని పవిత్ర ‘ఇమామ్ రెజా’ బలిపీఠం వద్ద అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
Epaper: epaper.vaartha.com
"ఆయనకు బాస్ ఎవరో తెలుసు".. నెతన్యాహుపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

