Khamenei's Mortal Remains : ఇరాన్ దేశ సుదీర్ఘ రాజకీయ, ఆధ్యాత్మిక చరిత్రలో అత్యంత కీలకమైన అధ్యాయం ముగిసింది. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంతిమ సంస్కారాల ప్రక్రియ ఆ దేశంలో అత్యంత అధికారిక లాంఛనాలతో, భారీ జనసందోహం మధ్య కొనసాగుతోంది.
ఆయనకు నివాళులు అర్పించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు లక్షలాదిగా తరలివస్తున్నారు. పలు నగరాల మీదుగా సాగిన ప్రత్యేక శోభాయాత్ర అనంతరం, ఖమేనీ పార్థివదేహం ఇవాళ ఇస్లామిక్ శతాబ్దాల చారిత్రక కేంద్రమైన ఖోమ్ (Qom) నగరానికి చేరుకుంది. తమ ప్రియతమ నేతను ఆఖరిసారి చూసేందుకు, ఆయన శవపేటికపై పూలు చల్లేందుకు వచ్చిన మద్దతుదారులు, సాధారణ ప్రజలతో ఖోమ్ నగర వీధులన్నీ పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఇరాన్ అధికారిక వర్గాల అంచనా ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల మందికి పైగా జనం ఖమేనీకి నివాళులు అర్పించేందుకు తరలిరావడం ఒక రికార్డుగా నిలిచింది.

ఇరాక్ పర్యటన అనంతరం మషద్లో అంత్యక్రియలు
షెడ్యూల్ ప్రకారం.. ఖోమ్ నగరంలో ప్రత్యేక ప్రార్థనలు పూర్తి చేసిన అనంతరం అలీ ఖమేనీ శవపేటికను పొరుగు దేశమైన ఇరాక్కు తరలించనున్నారు. షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన నజాఫ్, కర్బలా వంటి పుణ్యక్షేత్రాలలో ప్రార్థనల నిమిత్తం ఈ ఏర్పాటు చేశారు. ఇరాక్ పర్యటన ముగిసిన తర్వాత పార్థివదేహాన్ని తిరిగి ఇరాన్కు తీసుకువచ్చి, గురువారం నాడు పవిత్ర మషద్ (Mashhad) నగరంలో అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించనున్నారు. ఖమేనీ మృతితో ఇరాన్ అంతటా తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. భద్రతా పరంగా ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ సరిహద్దులు మరియు నగరాల అంతటా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
పథకం ప్రకారమే పహల్గామ్ దాడి..ఛార్జ్షీట్లో హఫీజ్ సయీద్ పేరు

