తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. 'జైశ్రీరామ్ అంటే పై నుంచి డబ్బులు పడతాయా?' అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
మంత్రి మాటలు కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను కించపరిచేలా ఉన్నాయని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. దేవాదాయ శాఖకు బాధ్యత వహిస్తూ భక్తిని, దైవ నామాన్ని ధనంతో పోల్చడం ఆమె అహంకారానికి నిదర్శనమని కమలం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : తల్లిదండ్రుల మరణాన్ని తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య

‘దైవద్రోహ శాఖ మంత్రి’ అంటూ బీజేపీ ఫైర్
మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ, ఆమెను ‘దేవాదాయ శాఖ మంత్రి’ అని కాకుండా ‘దైవద్రోహ శాఖ మంత్రి’ అంటూ తీవ్రంగా విమర్శించింది. భగవంతుడి నామాన్ని ఉచ్చరించడాన్ని కించపరచడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి హిందూ దేవుళ్ల పట్ల ఉన్న చులకన భావం మరోసారి బయటపడిందని ఆరోపించింది. పవిత్రమైన రామనామాన్ని వెక్కిరించడం క్షమించరాని నేరమని, అధికార గర్వంతోనే ఇటువంటి మాటలు వస్తున్నాయని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ కావడంతో రాజకీయ సెగలు రాజుకున్నాయి.
క్షమాపణలకు డిమాండ్
హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు గాను మంత్రి కొండా సురేఖ తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దేవాదాయ శాఖా మంత్రిగా ఉండి భక్తుల విశ్వాసాలను గౌరవించాల్సింది పోయి, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకత్వం దీనిపై స్పందించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మరియు మంత్రి ఈ వివాదాన్ని ఎలా సర్దుమణిగిస్తారో వేచి చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

