Karnataka Crime: కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. అదనపు కట్నం వేధింపులతో పాటు భార్య శరీరాకృతిని హేళన చేస్తూ, 29 ఏళ్ల స్టాఫ్ నర్స్ ప్రియాంక కమలాకర్ను ఆమె భర్త బసవరాజ్ వడ్డార్ గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు.
ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
పెళ్లయిన కొన్ని రోజులకే మొదలైన నరకం
పోలీసుల కథనం ప్రకారం.. ప్రియాంకకు 2024 డిసెంబర్లో బసవరాజ్తో వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన కొన్ని రోజుల నుండే ఆమెకు అత్తగారింట్లో వేధింపులు మొదలయ్యాయి. అదనంగా డబ్బు, బంగారం పుట్టింటి నుండి తీసుకురావాలంటూ భర్త బసవరాజ్, అతని కుటుంబ సభ్యులు ప్రియాంకపై తీవ్ర ఒత్తిడి తెచ్చేవారని ఎఫ్ఐఆర్ (FIR) లో పేర్కొన్నారు.
Karnataka Crime: ‘నువ్వు లావుగా ఉన్నావు’ అంటూ బాడీ షేమింగ్!
కట్నం వేధింపులతో పాటు ప్రియాంక శరీరాకృతిపై భర్త నిరంతరం నిందలు వేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. “నువ్వు చాలా లావుగా ఉన్నావు.. నీకు అస్సలు పిల్లలు పుట్టరు” అంటూ మానసికంగా తీవ్రంగా వేధించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, బసవరాజ్ ఆమెను గొంతు పిసికి చంపేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
రెండుసార్లు గర్భస్రావం.. నిందితుల అరెస్ట్
ప్రియాంక కుటుంబ సభ్యులు భర్త క్రూరత్వంపై మరికొన్ని ఆరోపణలు చేశారు. బసవరాజ్ తరచూ ప్రియాంకను శారీరకంగా తీవ్రంగా హింసించేవాడని, ఆ దెబ్బల కారణంగానే ఆమెకు గతంలో రెండుసార్లు గర్భస్రావం (Miscarriage) అయిందని కన్నీరుమున్నీరయ్యారు. అయితే ఈ గర్భస్రావం అంశాన్ని పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
ఈ ఘోర ఉదంతంపై నవలగుండ పోలీస్ స్టేషన్లో హత్య, వరకట్న వేధింపుల కింద కేసులు నమోదయ్యాయి. ప్రధాన నిందితుడైన భర్త బసవరాజ్తో పాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
read also:

