Thopudurthi Prakash Reddy Arrest: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని అనంతపురం పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు.
మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుతో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయ వివాదం ముదరడంతో, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న తోపుదుర్తి నివాసం వద్ద ఈ హైడ్రామా చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే..?
ఇటీవల మడకశిర నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజుపై తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పదవులను అడ్డం పెట్టుకుని రాజు గత రెండేళ్లలో కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టారని ప్రకాశ్ రెడ్డి విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు తీవ్రంగా స్పందించారు. తన ఆస్తులపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఇందులో భాగంగానే ప్రకాశ్ రెడ్డి ఇంటికే వస్తానని ఆయన హెచ్చరించడంతో ఇరువర్గాల మధ్య ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది.
Thopudurthi Prakash Reddy Arrest: ఉద్రిక్తతకు దారితీసిన నిరసన
ఎమ్మెల్యేల సవాళ్ల నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అయితే, తన ఇంటి చుట్టూ పోలీసులను పెట్టడంపై ప్రకాశ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనగా ఆయన రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు తోపుదుర్తిని ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు ప్రయత్నించడంతో శ్రీనగర్ కాలనీ పరిసర ప్రాంతాల్లో కాసేపు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Epaper: epaper.vaartha.com

