Konda Surekha : తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో మంత్రి కొండా సురేఖ మంత్రిపదవి వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించడం దాదాపు ఖాయమనే ప్రచారం పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్లతో క్రమశిక్షణా కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించనున్నట్లు సమాచారం. పార్టీ నిబంధనలు దాటి ప్రవర్తించిన అంశంతో పాటు కొన్ని అంతర్గత విభేదాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక ఆధారంగా సురేఖతో పాటు జి. చిన్నారెడ్డిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

కాపాడేందుకు యత్నాలు: క్యాబినెట్ విస్తరణలో భాగమేనా?
ఒకవైపు సురేఖపై వేటు పడటం ఖాయమనే వార్తలు వస్తుండగా, మరోవైపు కేబినెట్లోని కొందరు సీనియర్ మంత్రులు ఆమెకు మద్దతుగా నిలుస్తూ అధిష్టానంతో మాట్లాడేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్వహించనున్న క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ మార్పులు ఉండబోతున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అధిష్టానం క్రమశిక్షణకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందా లేక సమన్వయం వైపు మొగ్గు చూపుతుందా అనేది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ భేటీ ముగిసిన తర్వాతే స్పష్టత రానుంది.
Read Also hindi news: hindi.vaartha.com

