CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ మరోసారి తన నిరాడంబరమైన వ్యవహార శైలితో వార్తల్లో నిలిచారు. రాష్ట్రంలో మెట్రో సేవలపై ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహించేందుకు చేపట్టిన మెట్రో రివ్యూ రైడ్ లో భాగంగా ఆయన సాధారణ ప్రయాణికుడిలా చెన్నై మెట్రోలో ప్రయాణించారు.
ఈ సందర్భంగా ఓమండూరార్ మెట్రో స్టేషన్కు చేరుకున్న విజయ్ (CM Vijay), స్వయంగా టికెట్ కొనుగోలు చేసి నందనం వైపు మెట్రోలో ప్రయాణం చేశారు.
ప్రయాణికులు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి :
విజయ్ మెట్రో స్టేషన్కు రావడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు, అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యమంత్రి ఎలాంటి ఆర్భాటం లేకుండా సాధారణ ప్రయాణికులతో కలిసి ప్రయాణించడం చూసి పలువురు ఆయనను అభినందించారు. మెట్రోలో ఆయనను చూసిన అభిమానులు సెల్ఫీలు తీసుకోవడానికి, కరచాలనం చేయడానికి, మాట్లాడేందుకు ఆసక్తి చూపించారు.

ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఓ భావోద్వేగ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అభిమానుల్లో ఉన్న ఓ వృద్ధ మహిళ విజయ్ వద్దకు వెళ్లి ఆయన చేతిని ముద్దాడింది. విజయ్ కూడా చిరునవ్వుతో ఆమెను పలకరించి ఆప్యాయంగా స్పందించారు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న పలువురు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించగా, ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
విజయ్ సాధారణ ప్రజలతో కలిసి మెట్రోలో ప్రయాణించడం, వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రయత్నించడం అభిమానులను ఆకట్టుకుంది. ప్రజా రవాణా వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించాలనే ఉద్దేశంతో ఆయన ఈ రివ్యూ రైడ్ చేపట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విజయ్ మెట్రో ప్రయాణానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆయన సరళతను ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. ప్రజలకు మరింత చేరువగా ఉండే నాయకుడిగా విజయ్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

