KTR: తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి రాజకీయ నైజాన్ని ఎండగడుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రమైన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తురాలైన మీనాక్షి నటరాజన్ను సీఎం రేవంత్ రెడ్డి దారుణంగా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మధ్యప్రదేశ్ నుంచి ఆమెకు దక్కాల్సిన రాజ్యసభ అవకాశాన్ని చెడగొట్టేందుకు రేవంత్ రెడ్డి ఏకంగా బీజేపీతో చేతులు కలిపారని, ఆమెపై తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

Read also: Himayat Sagar: భారీ వర్షాల ఎఫెక్ట్.. జంట జలాశయాలకు పెరిగిన వరద నీరు
ఫిర్యాదు చేసినందుకే ప్రతీకారం..
ఆదివారం ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి అక్రమ భూదందాలు, అవినీతి వ్యవహారాలపై మీనాక్షి నటరాజన్ గతంలో కాంగ్రెస్ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చారని తెలిపారు. ఆ కక్షను మనసులో పెట్టుకునే, హైదరాబాద్ వేదికగా ఆమెపై తప్పుడు కేసు బనాయించారని మండిపడ్డారు. సొంత పార్టీ నాయకులను సైతం వదలకుండా దగా చేసే వ్యక్తి రేవంత్ అని దుయ్యబట్టారు. అంతేకాకుండా, ప్రపంచ నియంత హిట్లర్ తనకు ఆదర్శమని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించుకోవడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
KTR: కాంగ్రెస్ పాలన 'అట్టర్ ఫ్లాప్ సినిమా'..
తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ రథసారథ్యం ఒక 'అట్టర్ ఫ్లాప్ సినిమా'లా సాగుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయలేదన్నారు. ఏడాదికి రెండు లక్షల కొలువులు ఇస్తామని చెప్పి, కనీసం 4 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేకపోయిందని విమర్శించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4,000 భృతి హామీని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“రాష్ట్రంలో కోటి మంది మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం లక్షాధికారులను చేసిందని నిరూపిస్తే.. నేను తక్షణమే నా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం” అంటూ కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
ఖైరతాబాద్కు బై-ఎలక్షన్ ఖాయం..
ప్రజల తీర్పును కాలరాస్తూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన దానం నాగేందర్ తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక రావడం తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా సమరసన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో గులాబీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదును రికార్డు స్థాయిలో విజయవంతం చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

