Drishyam 3 Movie: మలయాళంలో మోహన్ లాల్ - జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన 'దృశ్యం', 'దృశ్యం 2' సినిమాలు ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ విజయాలను అందుకున్నాయి.
కథాకథనాల పరంగా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్పై కూర్చోబెట్టిన ఈ సిరీస్కు కొనసాగింపుగా ‘దృశ్యం 3’ తెరకెక్కింది. అయితే ఈసారి తెలుగులో రీమేక్ చేయకుండా, మోహన్ లాల్ నటించిన ఒరిజినల్ సినిమానే నేరుగా తెలుగు అనువాదంతో నేడు (మే 21వ తేదీ) థియేటర్లలో విడుదల చేశారు. మరి ఈ పార్ట్ ఏ స్థాయిలో ఉందో రివ్యూలో చూద్దాం.
Read Also : David Reddy Teaser: గూస్బంప్స్ తెప్పిస్తున్న మంచు మనోజ్ 'డేవిడ్ రెడ్డి' టీజర్..
Drishyam 3 Movie Review
కథ
గతం చేసిన గాయం, వరుణ్ హత్య తాలూకు భయం నుంచి జార్జ్ కుట్టి (మోహన్ లాల్), ఆయన భార్య రాణి (మీనా), పిల్లలు అంజూ, అనూ బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సాధ్యమైనంత త్వరగా పెద్ద కూతురు అంజూకు విదేశీ సంబంధం చూసి పెళ్లి చేయాలని, చిన్న కూతురు అనూని పైచదువుల కోసం ఫారిన్ పంపాలని జార్జ్ భావిస్తాడు. కానీ, వరుణ్ను అంజూనే చంపేసిందనే వార్త, ఆమె మానసిక పరిస్థితి బాగాలేదనే ప్రచారం మార్కెట్లో షికారు చేయడంతో పెళ్లి సంబంధాలు వెనక్కిపోతుంటాయి. ఈ ప్రచారం వెనుక ఎవరున్నారనేది తెలియక జార్జ్ కుటుంబం ఆందోళన చెందుతుంది.
మరోవైపు, జార్జ్ కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న మాజీ పోలీస్ అధికారులు సహదేవ్, రాజన్ కుటుంబాలు ఎలాగైనా జార్జ్ ఫ్యామిలీకి శిక్ష పడేలా చేయాలని కసితో రగిలిపోతుంటారు. వరుణ్ శవాన్ని ఎక్కడ దాచాడో కనిపెట్టేందుకు సహదేవ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారమెత్తి పావులు కదుపుతాడు. కొడుకును కోల్పోయిన గీత – ప్రభాకర్ దంపతులు కూడా జార్జ్ కూతురి పెళ్లి ఆపాలని, ఆధారాలు సేకరించాలని చూస్తుంటారు. ఇలా శత్రువులంతా కలిసి విసిరిన ప్రతీకార వలలో జార్జ్ కుటుంబం మళ్లీ ఎలా చిక్కుకుంది? ఈసారి జార్జ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అనేదే మిగతా కథ.
దృశ్యం మొదటి రెండు భాగాల మాదిరిగానే ఈ కథ కూడా ఒక హత్యా నేరం, దాని చుట్టూ అల్లిన ఉచ్చు చుట్టూనే తిరుగుతుంది. అయితే మొదటి రెండు సినిమాల్లో ఉన్నంత బిగువైన కథనం ఇందులో లోపించింది. ఫస్టాఫ్ చాలా నిదానంగా, ఎలాంటి ఆసక్తికరమైన మలుపులు లేకుండా సాగిపోతుంది. జార్జ్ తన చుట్టూ ఏదో జరుగుతోందని గమనించే సన్నివేశాలతో ప్రథమార్థం ముగుస్తుంది. దర్శకుడు అసలైన కథను ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాతే మొదలుపెట్టాడు. సెకండాఫ్లో శత్రువులంతా ఏకమై హీరోపై ఉచ్చు బిగించడం, దాని నుంచి తప్పించుకోవడానికి హీరో పడే పాట్లతో కథ కాస్త వేగం పుంజుకుంటుంది. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సమయంలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకుడికి కొంతవరకు ఊరట కలిగిస్తాయి.
సాంకేతిక లోపాలు
సతీశ్ కురుప్ ఫొటోగ్రఫీ మంచి మార్కులు కొట్టేస్తుంది. కొన్ని షాట్స్ గొప్పగా అనిపిస్తాయి. అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతం దృశ్యాలకు తగిన బలాన్ని ఇచ్చింది. వినాయక్ ఎడిటింగ్ ఫరవాలేదు. ఆర్టిస్టులంతా చాలా సహజంగా చేశారు. ఫస్టాఫ్ పలచగా ఉండటం .. సంభాషణలు పేలవంగా ఉండటం .. డబ్బింగ్ సంతృప్తికరంగా లేకపోవడం ఇతర లోపాలుగా కనిపిస్తాయి. మొదటి రెండు సినిమాల స్థాయిలో ‘దృశ్యం 3’ లేదనే చెప్పాలి.
ముగింపు
మొదటి రెండు భాగాల రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కేవలం ఒక సస్పెన్స్ డ్రామాగా చూస్తే ‘దృశ్యం 3’ పర్వాలేదనిపిస్తుంది. కానీ ‘దృశ్యం’ బ్రాండ్ ఇమేజ్ను ఆశించి వెళ్తే మాత్రం ఆశించిన స్థాయిలో త్రిల్ అవ్వడం కష్టమే!
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

