Mumbai Rain : దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బుధువారం నగరంలో ఏకంగా 10 సెంటీమీటర్లకు పైగా కుండపోత వర్షం కురవడంతో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది.
లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవగా, ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర నరకయాతన అనుభవించారు. ముంబైతో పాటు పరిసర ప్రాంతాలైన థానే, పుణే, రత్నగిరి జిల్లాల్లో కూడా వానలు దంచికొడుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రెండు రోజులు అత్యంత కీలకం
నగరంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) ముంబై నగరానికి ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. రేపు, ఎల్లుండి కూడా నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని మున్సిపల్ అధికారులు (BMC) సూచించారు. వరద సహాయక బృందాలను రంగంలోకి దించి, నీటిని తోడే పంపులను ఏర్పాటు చేసినట్లు యంత్రాంగం వెల్లడించింది. రానున్న 48 గంటల పాటు ముంబైవాసులు మరింత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన భక్తుల వాహనం.. ముగ్గురు యాత్రికులు మృతి!

