Ponguleti Srinivas Reddy: మూసీ నది పునరుద్ధరణ మరియు సుందరీకరణ ప్రాజెక్టు వల్ల ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, బాధితుల పునరావాస చర్యలపై అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేవలం చట్ట నిబంధనల ప్రకారమే కాకుండా, పూర్తిగా మానవీయ కోణాన్ని దృష్టిలో ఉంచుకుని భూసేకరణ ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు.. రైతులకు సరైన పరిహారం!
మూసీ ప్రాజెక్టు పరిధిలో ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని మంత్రి పొంగులేటి అధికారులకు సూచించారు. అలాగే ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇస్తున్న రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, చట్టప్రకారం తగిన పరిహారంతో పాటు మెరుగైన పునరావాస ప్యాకేజీని అందించాలని స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడబోదని తేల్చి చెప్పారు.
భవిష్యత్తులో హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరింత సుందరంగా మార్చడమే కాకుండా, విస్తృతమైన ప్రగతిని సాధించడమే లక్ష్యంగా ఈ మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టామని మంత్రి వివరించారు. ఈ బృహత్తర ప్రాజెక్టు వల్ల ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
Epaper: epaper.vaartha.com

